టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. మొత్తం మూడు రోజుల పాటు ఈ జిల్లాలో పర్యటించి నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. రెండో రోజు పర్యటనలో భాగంగా తణుకులో కార్యకర్తలతో సమావేశమయ్యారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పార్టీ కార్యకర్తలను తన సమావేశాలకు హాజరుకాకుండా పోలీసులు భయపెడుతున్నారని చెప్పారు. తన దగ్గరకు కార్యకర్తలను రానీయకుండా చేస్తున్నారని, పోలీసులు తనకు కూడ నోటీసులిచ్చారని చెప్పారు.
పోలీసు యాక్టు-30 పేరుతో టీడీపీ కార్యకర్తలను వేధిస్తున్నారు, వారికి అన్యాయంగా నోటీసులు ఇస్తున్నారని ఆరోపించారు. మాజీ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై పోలీసులు వరుసగా 13 కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు, ఈ కేసులపై జిల్లా ఎస్పీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే ఆశా వర్కర్లను పరామర్శించినందుకే పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పైనా కూడ కేసు పెట్టారని విమర్శించారు. ప్రభుత్వ మెప్పు పొందాలనే టీడీపీ నాయకులు, కార్యకర్తలను బెదిరిస్తున్నారు, ఇష్టానుసారం తప్పుడు కేసులు పెట్టడం సరైన పద్ధతి కాదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
[subscribe]