కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం ప్రారంభమైంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతున్న ఈ సమావేశానికి సీడబ్ల్యూసీ సభ్యులు సహా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, ఇతర కీలక నాయకులను కూడా ఆహ్వానించినట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. ముందుగా పార్టీ నాయకత్వంలో మార్పులు అవసరమని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి పనిచేసేలా పార్టీ నాయకత్వం ఉండాలని 23 మంది సీనియర్ నేతలు పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసిన నేపథ్యంలో పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
తాత్కాలిక అధ్యక్ష బాధ్యతల నుంచి సోనియాగాంధీ తప్పుకున్నారంటూ ఆదివారం నాడు వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ వార్తలను పార్టీ ఖండించింది. కాంగ్రెస్ పార్టీలో ఓ వర్గం గాంధీ కుటుంబం మాత్రమే పార్టీకి పునర్ వైభవం తెస్తుందని మద్దతు తెలుపుతుండగా, మరోవర్గం ఇతరులకు సైతం పార్టీనాయకత్వంలో స్థానం కల్పించి సమిష్టిగా ముందుకెళ్లాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు జరుగుతున్న సీడబ్ల్యూసీ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. బాధ్యతల నుంచి సోనియా గాంధీ తప్పుకుంటారా?, పూర్తి స్థాయి అధ్యక్షురాలిగా మారతారా లేదా కొత్త వ్యక్తికీ పగ్గాలు అప్పగిస్తారా అనే అంశంపై సీడబ్ల్యూసీ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో నెలకుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu