హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలక ప్రకటన చేశారు. త్వరలో బీజేపీలోకి భారీ చేరికలు ఉంటాయని, రెండు ప్రధాన పార్టీల నుంచి బీజేపీ లోకి రావడానికి ఎంతోమంది ఉత్సాహం చూపుతున్నారని చెప్పిన ఈటల.. ఇప్పటికే సిద్ధంగా ఉన్న కొంతమంది నేతల జాబితా విడుదల చేశారు. ఈనెల 21వ తేదీన అమిత్ షా సమక్షంలో కన్నెబోయిన రాజయ్య యాదవ్, ఎర్రబెల్లి ప్రదీప్ రావు, దాసోజు శ్రవణ్తో పాటు మరికొంత మంది బీజేపీ లో చేరనున్నట్లు ప్రకటించారు. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరికతో మునుగోడులో బీజేపీకి బలం పెరగనుందని తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు.
ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలకు విశ్వాసం పోయిందని, టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే పార్టీలోని ఉద్యమకారులకు తగిన గౌరవం లభించడం లేదని, ఈ కారణంగానే ఉద్యమకారులందరూ టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే అన్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకూ పతనావస్థకు చేరుకుంటోందని, దీనికి తోడు తెలంగాణాలో ఆ పార్టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలతో ఇబ్బందులు పడుతున్న వారు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి త్వరలో భాజపాలోకి భారీ చేరికలు ఉంటున్నాయని స్పష్టం చేశారు.
ఇక విద్యారంగంలో రాష్ట్ర విభజనకు ముందు గురుకుల పాఠశాలల పనితీరు ఉన్నతంగా ఉండేదని, తెలంగాణ ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం దీనిపై దృష్టి సారించకుండా అధిక సంఖ్యలో రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేశారని, కానీ వాటిలో కూడా సరైన మౌలిక సదుపాయాలు కల్పించ లేదని ఆరోపించారు. సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో చదివే విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఆవేదన చెందుతున్నారని తెలిపారు. సరైన వసతులు లేక, భోజన సదుపాయాలు లేక ఎంతో మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సీఎం కేసీఆర్ రెసిడెన్షియల్ పాఠశాలలపై దృష్టి పెట్టి వారి సమస్యలు తీర్చాలని ఈటల డిమాండ్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY