దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార ఘటనపై ఢిల్లీలోని తీస్హజారీ కోర్టు డిసెంబర్ 16, సోమవారం నాడు సంచలనం తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్సింగ్ సెంగార్ను దోషిగా నిర్ధారిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. కేసును సుదీర్ఘంగా విచారించిన అనంతరం తీర్పు వెలువరిస్తూ, ఈ నెల 19వ తేదీ గురువారం నాడు శిక్ష ఖరారు చేయనున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు. కుల్దీప్సింగ్ సెంగార్ కు ఈ కేసులో జీవితఖైదు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కోంటున్న మరో నిందితుడు శశిసింగ్ ను కోర్టు నిర్ధోషిగా ప్రకటించింది.
2017లో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటన దేశంలో సంచలనంగా మారింది. ఈ కేసులో ఉత్తరప్రదేశ్ లోని బంగేరుమౌ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కుల్దీప్సింగ్ సెంగార్ మరియు శశిసింగ్ అనే వ్యక్తి పై పలు సెక్షన్ల కింద కేసు నమోదయింది. ప్రతిపక్షాలనుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో బీజేపీ పార్టీనుంచి సెంగార్ ను బహిష్కరించింది. అనంతరం బాధితురాలు ప్రయాణిస్తున్న కారుకి జరిగిన ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడగా, సన్నిహిత బంధువులు ఇద్దరు మరణించారు. అలాగే ఈ ప్రమాద ఘటనలో లాయర్ సైతం గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లక్నో నుంచి ఢిల్లీ హైకోర్టుకు ఈ కేసు బదిలీ అయింది. ఆగస్టు 5వ తేదీ నుంచి న్యాయమూర్తి ధర్మేశ్ శర్మ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసుపై రోజువారీ విచారణ చేపట్టి తీర్పును రిజర్వ్లో ఉంచింది. కాగా ఈ రోజు ఈ కేసులో కుల్దీప్సింగ్ సెంగార్ను దోషిగా నిర్ధారిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.
[subscribe]