దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి విజృంభణతో వీకెండ్ కర్ఫ్యూ (వారాంతపు కర్ఫ్యూ) అమలు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఢిల్లీలో పాజిటివ్ కేసులు నమోదు క్రమంగా తగ్గుముఖం పడుతుండడంతో ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (డీడీఎంఏ) కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో వారాంతపు కర్ఫ్యూను ఎత్తివేయాలని డీడీఎంఏ సమావేశంలో గురువారం నిర్ణయం తీసుకున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు. అయితే రాత్రి 10 నుండి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూను మాత్రం కొనసాగించాలని నిర్ణయించారు.
మరోవైపు దుకాణాలు తెరిచేందుకు సరి-బేసి విధానాన్ని కూడా ముగించారు. బార్లు, రెస్టారెంట్లు మరియు సినిమా థియేటర్స్ 50 శాతం సామర్థ్యంతో, అలాగే ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఇకపై 50 శాతం సామర్థ్యంతో పనిచేయనున్నాయి. ఇక ఢిల్లీలో వివాహాలకు గరిష్టంగా 200 మందిని లేదా వేదిక సామర్థ్యంలో 50 శాతంతో అనుమతించాలని నిర్ణయించారు. పాఠశాలల పునఃప్రారంభంపై ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. పరిస్థితులకు అనుగుణంగా పాఠశాలలు తెరిచే అంశాన్ని వచ్చే డీడీఎంఏ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ