ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు విచారణలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దూకుడు పెంచింది. మద్యం కుంభకోణం కేసులో ఆదివారం ఆప్ కీలక నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ ఆదివారం అరెస్టు చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా ఆదివారం ఉదయం 11 గంటలకు మనీశ్ సిసోడియా సీబీఐ ముందు హాజరవగా, దాదాపు ఎనిమిది గంటలపాటు విచారించిన అనంతరం ఆయనను అరెస్ట్ చేస్తున్నట్టుగా సీబీఐ అధికారులు ప్రకటించారు. ఈ కేసు విచారణకు మనీశ్ సిసోడియా సహకరించకపోవడం, తమ ప్రశ్నలకు వివరణ ఇవ్వకుండా తప్పించుకుంటున్న నేపథ్యంలోనే ఆయనను అరెస్టు చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-2022కి సంబంధించి సీబీఐ గతంలో దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ లో 15 మంది వ్యక్తుల పేర్లు పేర్కొనగా, ఆ జాబితాలో సిసోడియా కూడా ఉన్న విషయం తెలిసిందే. కాగా సోమవారం సిసోడియాను సీబీఐ అధికారులు కోర్టులో హాజరుపరిచే అవకాశముంది.
విచారణకు వెళ్లే ముందు మనీశ్ ట్వీట్ చేస్తూ, “ఈరోజు మళ్లీ సీబీఐ విచారణకి వెళతాను, మొత్తం విచారణకు నేను పూర్తిగా సహకరిస్తాను. లక్షలాది మంది పిల్లల ప్రేమ, కోట్లాది మంది దేశప్రజల ఆశీస్సులు మా వెంట ఉన్నాయి. కొన్ని నెలలు జైల్లో ఉండాల్సి వచ్చినా పట్టించుకోవడం లేదు. నేను భగత్ సింగ్ అనుచరుడుని, దేశం కోసం భగత్ సింగ్ ఉరితీయబడ్డాడు. ఇలాంటి తప్పుడు ఆరోపణల వల్ల జైలుకు వెళ్లడం చిన్న విషయం” అని పేర్కొన్నారు.
మనీశ్ సిసోడియా అరెస్ట్ పై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేస్తూ “మనీశ్ సిసోడియా నిర్దోషి. ఇవి డర్టీ పాలిటిక్స్. మనీష్ అరెస్ట్ పట్ల ప్రజల్లో చాలా కోపం ఉంది. అందరూ చూస్తున్నారు. ప్రజలు అన్నీ అర్థం చేసుకుంటున్నారు. దీనిపై ప్రజలు స్పందిస్తారు” అని పేర్కొన్నారు. మరోవైపు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తమ పార్టీ నేత మనీష్ సిసోడియా అరెస్టుకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ సోమవారం దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద మధ్యాహ్నం 12 గంటల సమయంలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు ఆప్ ప్రకటించింది. .
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE