అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారతదేశ పర్యటనలో భాగంగా ఫిబ్రవరి 24, సోమవారం ఉదయం 11:40 గంటలకు భారత్ చేరుకున్నారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో గల సర్దార్ వల్లభాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ట్రంప్ కు భారత ప్రధాని నరేంద్ర మోదీ, గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, పలువురు కేంద్ర మంత్రుల ఘన స్వాగతం పలికారు. అమెరికా సైనిక విమానం ఎయిర్ఫోర్స్ వన్లో ట్రంప్ తో పాటుగా తన సతీమణి మెలనియా, కుమార్తె ఇవాంకా, అల్లుడు జరేడ్ కుశ్నర్ సహా మొత్తం 12 మంది బృందం భారత్ కు చేరుకున్నారు. సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్య ప్రదర్శనలు, వాయిద్యాలతో పలువురు కళాకారులు వారికీ స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి తన బీస్ట్ వాహనంలో ట్రంప్ సబర్మతి ఆశ్రమానికి బయలుదేరారు.
సబర్మతి ఆశ్రమానికి వెళ్లే దారిలో భారత్, అమెరికా జాతీయ జెండాలు ఊపుతూ ప్రజలు అడుగడుగునా ట్రంప్ కు స్వాగతం పలికారు. సబర్మతి ఆశ్రమానికి చేరుకుని అక్కడ 20 నిమిషాల పాటు ట్రంప్ తన సమయాన్ని గడిపారు. ప్రధాని మోదీతో కలిసి జాతిపిత మహాత్మాగాంధీ చిత్ర పటానికి వస్త్ర మాల వేశారు. ప్రధాని సూచనల మేరకు కొద్దిసేపు చరఖా తిప్పారు. ఆశ్రమంలోని సందర్శకుల పుస్తకంలో తన సందేశాన్ని రాసి సంతకం పెట్టారు. అనంతరం సబర్మతి ఆశ్రమం నుంచి గాంధీనగర్లో కొత్తగా నిర్మించిన మొతేరా స్టేడియం వద్దకు బయలుదేరారు. మొతేరా స్టేడియాన్ని ట్రంప్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం స్టేడియంలో నిర్వహించే ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో ట్రంప్ ప్రసంగిస్తారు.
[subscribe]