ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల కోసం ఇప్పటికే అమ్మఒడి, నాడు-నేడు పథకాలను వైసీపీ ప్రభుత్వం అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పేద విద్యార్థులకు అండగా ఉండేందుకు ‘జగనన్న వసతి దీవెన’ పేరుతో మరో ప్రతిష్టాత్మక పథకానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఫిబ్రవరి 24, సోమవారం నాడు విజయనగరం జిల్లాలో ఈ పథకాన్ని సీఎం వైఎస్ జగన్ అధికారికంగా ప్రారంభించారు. ముందుగా విజయనగరం అయోధ్య మైదానంలో వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం పరిశీలించారు. అనంతరం వేదికపైకి చేరుకొని ‘జగనన్న వసతి దీవెన’ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా విజయనగరం జిల్లాకు చేరుకున్న వైఎస్ జగన్ కు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
జగనన్న వసతి దీవెన పథకం కింద ఐటీఐ విద్యార్థులకు ఏడాదికి 10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు 15 వేలు చెల్లించనున్నారు. అలాగే డిగ్రీ, ఆపైన చదువుకునే విద్యార్థులకు ఏడాదికి 20 వేల చొప్పున చెల్లిస్తారు. అర్హులైన విద్యార్థుల యొక్క తల్లుల బ్యాంకు ఖాతాల్లో రెండు విడతలుగా ఈ నగదును జమ చేయనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. పేద విద్యార్థుల వసతి, భోజన ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ రెండు పథకాలు వర్తించాలంటే విద్యార్థులకు 75 శాతం మేర హాజరు తప్పని సరిగా ఉండాలి. అలాగే డీమ్డ్ యూనివర్సిటీలు, కరస్పాండెన్స్, ప్రైవేటు, దూర విద్య, మేనేజ్మెంట్ కోటాలో సీట్లు పొందిన విద్యార్థులకు ఈ పథకాలు వర్తించవని తెలిపారు.
[subscribe]