ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సోమవారం ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేశారు. త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నానని, ప్రజల వద్దకు వెళ్లే సమయం ఆసన్నమయిందని ప్రకటించారు. త్వరలోనే రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రశాంత్ కిషోర్ హింట్ ఇచ్చారు. “ప్రజాస్వామ్యంలో అర్థవంతమైన భాగస్వామిగా ఉండాలనే నా తపన మరియు ప్రజానుకూల విధానాన్ని రూపొందించడంలో సహాయం చేయడం 10 ఏళ్ల రోలర్ కోస్టర్ రైడ్కు దారితీసింది. ఇకపై సమస్యలను బాగా అర్థం చేసుకోవడానికి నిజమైన మాస్టర్స్ అయిన ప్రజల వద్దకు వెళ్లే సమయం వచ్చింది. జన సురాజ్-ప్రజల సుపరిపాలన కోసం అడుగులు వేస్తున్నా. ఈ ప్రయాణం బీహార్ నుంచి ప్రారంభం కానుంది” అని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు.
ప్రశాంత్ కిషోర్ తాజా ప్రకటనతో బీహార్ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించబోతున్నట్టు స్పష్టం అవుతుంది, అయితే జన సురాజ్ పేరుతో కొత్త పార్టీ పెడతారా? లేదా ఇతర ప్రతిపక్షాలతో చేరతారా అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. నాలుగేళ్ళ క్రితం బీహార్ లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ పార్టీలో ప్రశాంత్ కిషోర్ చేరిన సంగతి తెలిసిందే. అనంతరం నితీష్ తో విభేదాల వలన పార్టీ నుంచి అతన్ని తప్పించారు. ఈ క్రమంలో మళ్ళీ ప్రశాంత్ కిషోర్ తన సొంత రాష్ట్రమైన బీహార్కు తిరిగి వెళ్లడం ప్రాధానత్య సంతరించుకుంది.
మరోవైపు ఇటీవల పలుమార్లు కాంగ్రెస్ పార్టీతో చర్చల అనంతరం పార్టీలో చేరడంపై ప్రశాంత్ కిషోర్ స్పష్టత ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరించినట్టు ప్రశాంత్ కిషోర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎంపవర్డ్ గ్రూప్ లో భాగంగా పార్టీలో చేరాలని, ఎన్నికల బాధ్యత తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తన ముందు ఉంచిన ప్రతిపాదనను తిరస్కరించినట్టు ప్రశాంత్ కిషోర్ తెలిపారు. కాంగ్రెస్ కు తనకంటే లోతుగా పాతుకుపోయిన నిర్మాణ సమస్యలను పరివర్తన సంస్కరణల ద్వారా పరిష్కరించడానికి నాయకత్వం మరియు సమష్టి సంకల్పం అవసరం అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరొద్దని నిర్ణయించుకున్నాక, తాజా ప్రకటనతో ప్రశాంత్ కిషోర్ మరోసారి దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ