ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడంపై మంగళవారం ప్రశాంత్ కిషోర్ కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరించినట్టు ప్రశాంత్ కిషోర్ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. “ఎంపవర్డ్ గ్రూప్ లో భాగంగా పార్టీలో చేరాలని, ఎన్నికల బాధ్యత తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నా ముందు ఉంచిన ప్రతిపాదనను నేను తిరస్కరించాను. నా వినయపూర్వకమైన అభిప్రాయం ప్రకారం, కాంగ్రెస్ పార్టీలో లోతుగా పాతుకుపోయిన నిర్మాణ సమస్యలను పరివర్తన సంస్కరణల ద్వారా పరిష్కరించడానికి నా కంటే పార్టీకి నాయకత్వం మరియు సమష్టి సంకల్పం అవసరం” అని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు.
మరోవైపు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, వర్కింగ్ కమిటీ మెంబెర్ రణదీప్ సింగ్ సూర్జేవాలా ట్వీట్ చేస్తూ, “ప్రశాంత్ కిషోర్ తో ప్రెజెంటేషన్ మరియు చర్చల తర్వాత కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్-2024ని ఏర్పాటు చేశారు మరియు పూర్తి నిర్ధిష్ట బాధ్యతతో ఈ గ్రూప్ లో భాగంగా పార్టీలో చేరాలని అతన్ని ఆహ్వానించారు. అయితే అందుకు ప్రశాంత్ కిషోర్ నిరాకరించాడు. ఆయన చేసిన కృషిని, పార్టీకి ఇచ్చిన సూచనలను మేము అభినందిస్తున్నాము” అని పేర్కొన్నారు.
ఇటీవల ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు, ప్రణాళికలపై వరుసగా సోనియా గాంధీతో చర్చలు జరిపారు. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా రాబోయే సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అమలుచేయాల్సిన ప్రణాళికా వ్యూహంపై ప్రశాంత్ కిషోర్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ఈ క్రమంలోనే పార్టీలోని ముఖ్యనేతల అభిప్రాయాలను కూడా తీసుకున్న తర్వాత ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశముందని ప్రచారం జరిగింది. ఈ పరిణామాల మధ్యనే తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్ కు సలహాదారుగా ప్రశాంత్ కిషోర్ కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ