ఉత్తర్ ప్రదేశ్, గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్ వంటి 5 రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం నాడు ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర, ఎన్నికల కమిషనర్లు రాజీవ్ కుమార్ మరియు అనుప్ చంద్ర పాండేతో కలిసి ఆయా రాష్ట్రాల్లో కోవిడ్-19 వ్యాప్తి యొక్క ప్రస్తుత పరిస్థితిపై మరోసారి సమగ్ర సమీక్ష నిర్వహించారు. కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు, ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఎన్నికల ప్రధాన కార్యదర్శులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కోవిడ్ మహమ్మారి పరిస్థితులు, సంబంధిత రాష్ట్రాల్లోని అర్హులైన వ్యక్తుల కోసం మొదటి, రెండో డోసుల ప్రస్తుత వ్యాక్సినేషన్ స్టేటస్, పోలింగ్ సిబ్బందికి ఏర్పాట్లకు సంబంధించి పూర్తిస్థాయిలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయాలు తీసుకుంది.
కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే:
- 5 రాష్ట్రాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న రోడ్ షోలు, పాదయాత్రలు, సైకిల్/బైక్/వాహనాల ర్యాలీలు మరియు ఊరేగింపులపై నిషేధాన్ని ఫిబ్రవరి 11, 2022 వరకు పొడిగించారు.
- ఫిబ్రవరి 1, 2022 నుండి అన్ని దశల ఎన్నికలకు రాజకీయ పార్టీలు లేదా పోటీ చేసే అభ్యర్థుల భౌతిక బహిరంగ సభలకు గరిష్టంగా 1000 మంది వ్యక్తులతో (ప్రస్తుతం ఉన్న 500 మంది వ్యక్తులకు బదులుగా) అనుమతించాలని లేదా గ్రౌండ్ పరిమితిలో 50% మందితో లేదా ఎస్డీఎంఏ ద్వారా నిర్దేశించిన నిర్ణీత పరిమితి ఆధారంగా ఏ సంఖ్య తక్కువగా ఉంటే ఆ నియమంతో సభలు నిర్వహించుకోవచ్చని తెలిపింది.
- డోర్ టు డోర్ క్యాంపెయిన్ పరిమితిని కూడా పెంచారు. 10 మంది వ్యక్తులకు బదులుగా, భద్రతా సిబ్బందిని మినహాయించి ఇప్పుడు 20 మంది వ్యక్తులు ఇంటింటికీ ప్రచారానికి అనుమతించబడతారు. ఇంటింటికి ప్రచారానికి సంబంధించిన ఇతర సూచనలు కొనసాగనున్నాయి.
- ఇండోర్ సమావేశాలకు సంబంధించి రాజకీయ పార్టీలకు గరిష్ఠంగా 500 మంది (ఇప్పటికే ఉన్న 300 మంది వ్యక్తులకు బదులుగా) లేదా హాల్ సామర్థ్యంలో 50% లేదా ఎస్డీఎంఏ నిర్దేశించిన నిర్ణీత పరిమితిని అనుమతించేంత వరకు సడలింపును మంజూరు చేశారు.
- రాజకీయ పార్టీలు మరియు పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికలకు సంబంధించిన కార్యకలాపాల సమయంలో అన్ని సందర్భాలలో కోవిడ్ నిబంధనలు, మార్గదర్శకాలు పాటిస్తూ, ఎన్నికల కోడ్ కు అనుగుణంగా ఉండేలా చూడాలని పేర్కొన్నారు.
- ఇక జనవరి 8, 2022న జారీ చేయబడిన ఎన్నికల నిర్వహణ కోసం సవరించిన విస్తృత మార్గదర్శకాలలో ఉన్న అన్ని మిగిలిన పరిమితులు యధావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ