మహారాష్ట్రలో రాజకీయాలు క్షణక్షణానికి రసవత్తరంగా మారుతూ క్లైమాక్స్ కు చేరుకున్నాయి. అక్టోబర్ 24న ఫలితాలు వెలువడగా, 19 రోజులు పాటు ముఖ్యమంత్రి పీఠంపై రాష్ట్రంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. చివరికి మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు ఆ రాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ సిఫార్సు చేసారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ, శివసేన పార్టీలకు అవకాశం కల్పించినప్పటికీ అవసరమైన మద్దతు కూడగట్టకపోవడంతో రాష్ట్రపతి పాలనకు ప్రతిపాదించినట్టు తెలిపారు. ‘మహారాష్ట్ర ప్రభుత్వాన్ని రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేసే అవకాశం లేకపోవడంతో, రాజ్యాంగంలోని రాష్ట్రపతి పాలనగా పిలవబడే ఆర్టికల్ 356ని పరిగణనలోకి తీసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్ ఒక నివేదికను సమర్పించారని’ రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీలో సమావేశమయింది. గవర్నర్ అభ్యర్థనను పరిశీలించి మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు కేంద్ర కేబినెట్ కూడ ఆమోదం ముద్ర వేసినట్టు తెలుస్తుంది. అనంతరం కేబినెట్ నిర్ణయాన్ని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపినట్లు సమాచారం. అయితే బీజేపీ, శివసేన తరువాత ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీను ఆహ్వానించినా గడువు ఇంకా ముగియకముందే రాష్ట్రపతి పాలనకు గవర్నర్ ఎలా సిఫార్సు చేస్తారని ఎన్సీపీ, శివసేన నాయకులు మండిపడుతున్నారు.
ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు పొందడం కోసం శివసేన పార్టీ కోరిన గడువును, గవర్నర్ కోశ్యారీ తిరస్కరించిన సంగతి తెలిసిందే. గవర్నర్ నిర్ణయంతో అసంతృప్తి చెందిన శివసేన సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతోంది. బీజేపీకి మూడు రోజుల గడువు కల్పించిన గవర్నర్, శివసేనకు మాత్రం 24 గంటలు మాత్రమే గడువు ఇచ్చారని ఈ విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరో వైపు గవర్నర్ ఇచ్చిన గడువు కంటే ముందే రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫార్సు చేయడంపై న్యాయపరంగా ఎలా వ్యవహరించాలనే విషయంపై శివసేన నాయకులు, సీనియర్ న్యాయవాది కాంగ్రెస్ పార్టీ కీలక నేత అయిన కపిల్ సిబల్తో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.
[subscribe]