జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నవంబర్ 12, మంగళవారం నాడు మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ని కలిశారు. అమరావతిలోని రాజ్ భవన్ కు వెళ్లిన పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఇసుక కొరతపై గవర్నర్ కు లేఖ అందించారు. భవన నిర్మాణ కార్మికులు ఇసుక దొరక్క ఉపాధి కోల్పోయి దుర్భర స్థితిని ఎదురుకుంటున్నారని, జనసేన పార్టీ ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదు, కార్మికులుకు ఉపాధి కల్పించడం జరగలేదని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇసుక సరఫరా పునరుద్ధరించి కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ జనసేన ఆధ్వర్యంలో నవంబర్ 3న విశాఖపట్నంలో భారీ లాంగ్ మార్చ్ నిర్వహించిన విషయాన్ని కూడ లేఖలో పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ఇసుక సమస్యపై వెంటనే జోక్యం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం స్పందించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ను పవన్ కళ్యాణ్ కోరారు.
గవర్నర్తో దాదాపుగా అరగంటకు పైగా జరిగిన ఈ భేటీలో భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు, ఇసుక కొరత సమస్య, ఇతర అంశాలపై చర్చించినట్టు తెలుస్తుంది. ఇటీవలే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెడుతున్నట్లు వైసీపీ ప్రభుత్వం జీవో విడుదల చేసిన విషయాన్ని కూడ గవర్నర్ వద్ద పవన్ కళ్యాణ్ ప్రస్తావించినట్లు సమాచారం. ఈ భేటీ వివరాలు, రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై ఈ రోజు సాయంత్రం 4 గంటలకు విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించే మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడనున్నారు.
[subscribe]