దేశంలో మరోసారి రికార్డ్ స్థాయిలో వస్తు మరియు సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు నమోదయ్యాయి. 2022 ఏప్రిల్ నెలలో మొత్తం రూ.1,67,540 కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయని తెలిపారు. 2022 మార్చి నెలలో వసూలైన అత్యధిక రూ.1,42,095 కోట్లను దాటి, ఏప్రిల్ నెలలో రూ. 25,000 కోట్లు ఎక్కువగా వసూలయ్యాయని, జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఇంత భారీగా వసూలు కావడం ఇదే తొలిసారని కేంద్ర ఆర్థికశాఖ అధికారులు వెల్లడించారు. అలాగే ఏప్రిల్ 2022లో నమోదైన జీఎస్టీ వసూళ్లు ఏప్రిల్ 2021 కంటే 20% ఎక్కువని పేర్కొన్నారు.
దేశంలో తొలిసారిగా స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.1.5 లక్షల కోట్ల మార్కును దాటాయని, మార్చి 2022 నెలలో ఉత్పత్తి చేయబడిన మొత్తం ఇ-వే బిల్లుల సంఖ్య 7.7 కోట్లు కాగా, ఇది ఫిబ్రవరి 2022 నెలలో ఉత్పత్తి చేయబడిన 6.8 కోట్ల ఇ-వే బిల్లుల కంటే 13% ఎక్కువన్నారు. ఇది దేశంలో వ్యాపార కార్యకలాపాలు వేగవంతమైన పునరుద్ధరణను ప్రతిబింబిస్తుందని చెప్పారు. ఏప్రిల్ 2022 నెలలో 20వ తేదీన ఒకే రోజులో అత్యధిక పన్ను వసూళ్లు నమోదయ్యాన్నారు. ఆ రోజు సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు ఒక గంట సమయంలో అత్యధిక వసూళ్లు జరిగాయని తెలిపారు. ఏప్రిల్ 20, 2022న 9.58 లక్షల లావాదేవీల ద్వారా రూ.57,847 కోట్లు చెల్లించబడగా, కేవలం సాయంత్రం 4-5 గంటల సమయంలో 88,000 లావాదేవీల ద్వారా దాదాపు రూ.8,000 కోట్లు చెల్లించబడ్డాయని చెప్పారు.
గతఏడాదితో పోలిస్తే ఏపీలో 22%, తెలంగాణలో 16% పెరుగుదల:
ఏప్రిల్ లో సీజీఎస్టీ వసూళ్లు రూ.33,159 కోట్లు కాగా, ఎస్జీఎస్టీ వసూళ్లు రూ.41,793 కోట్లు, ఐజీఎస్టీ రూ.81,939 కోట్లు (దిగుమతులపై వసూళ్లు రూ.36,705 కోట్లతో సహా) మరియు సెస్సుల నుంచి రూ.10,649 కోట్లు(దిగుమతులపై వసూలు చేసిన రూ.857 కోట్లతో కలిపి) గా నమోదయ్యాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో గత ఏడాది జీఎస్టీ వసూళ్లు (రూ.3,345 కోట్లు) పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్ లో (రూ.4,067 కోట్లు) 22 శాతం పెరిగాయి. అలాగే తెలంగాణలో 2021 ఏప్రిల్లో రూ.4,262 కోట్లు వసూలు కాగా, 2022 ఏప్రిల్ లో 16 శాతం పెరుగుదలతో రూ.4,955 కోట్లు వసూలు అయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ