రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటనను తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. మే 6వ తేదీన వరంగల్ లో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్ “రైతు సంఘర్షణ సభ” నిర్వహిస్తుంది. వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ లో జరిగే ఈ సభ కోసం టీ కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే జన సమీకరణ సహా ఇతర ఏర్పాట్లపై దృష్టి సారించారు. రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబం నుంచి ఒక్కరు చొప్పున సభకు రావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మరోవైపు తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన పూర్తి షెడ్యూల్ విడుదలైంది.
తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన షెడ్యూల్:
మే 6, శుక్రవారం సాయంత్రం 4 గంటలకు రాహుల్ గాంధీ ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో వరంగల్ చేరుకుని, ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో పాల్గొంటారు. కాగా సభలో రెండు వేదికలు ఏర్పాటు చేయనున్నారు. రాహుల్ గాంధీ, ఇతర ముఖ్య నేతల కోసం ఒక వేదిక, అలాగే ఆత్మహత్య చేసుకుని చనిపోయిన రైతుల కుటుంబాలకు కోసం మరో సభ వేదిక ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 7 గంటలకు సభను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగిస్తారు. ఇక సభ ముగిసాక రోడ్డు మార్గంలో హైదరాబాద్ కు చేరుకుని, దుర్గం చెరువు పక్కన ఉన్న ఐటీసీ కోహినూర్ హోటల్ లో రాహుల్ గాంధీ బస చేయనున్నారు.
మే 7, శనివారం ఉదయం హోటల్ కోహినూర్ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి అల్పాహారం కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం సంజీవయ్య పార్కు వద్దకు చేరుకొని, మాజీ సీఎం దామోదరం సంజీవయ్య వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తారు. అక్కడి నుంచి గాంధీభవన్ కు చేరుకొని దాదాపు 200 మంది కీలక నేతలతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా డిజిటల్ సభ్యత్వ నమోదుదారులతో రాహుల్ గాంధీ ఫోటో సెషన్లో పాల్గొంటారు. అనంతరం తెలంగాణ అమరవీరుల కుటుంబాలతో కలిసి రాహుల్ మధ్యాహ్న భోజనం చేస్తారు. ఇక సాయంత్రం 4 గంటలకు పర్యటన ముగించుకుని, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ