జమ్మూకశ్మీర్ రాజోరి జిల్లాలోని సుందర్బాని సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబట ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు భారత ఆర్మీ సైనికులు వీరమరణం చెందారు. కాల్పుల్లో వీర మరణం పొందిన జవాన్లలో నాయిబ్ సుబేదార్ ఎం శ్రీజిత్, జవాన్ మారుప్రోలు జస్వంత్ రెడ్డి ఉన్నారు. జవాన్ మారుప్రోలు జస్వంత్ రెడ్డిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా బాపట్ల మండలంలోని దరివాద కొత్తపాలెం గ్రామం. జశ్వంత్రెడ్డి మృతిపై తల్లిదండ్రులు శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరమ్మలకు శుక్రవారం తెల్లవారుజామున ఆర్మీ అధికారులు సమాచారం అందించారు.
జస్వంత్ రెడ్డి 17 మద్రాస్ రెజ్మెంట్ లో 2016 లో సైన్యంలో చేరారు. శిక్షణ అనంతరం నీలగిరిలో మొదటగా విధులు నిర్వహించగా, ప్రస్తుతం జమ్మూకశ్మీర్ లో విధుల్లో ఉన్నారు. నాలుగు నెలల క్రితమే సెలవులపై ఇంటికి వచ్చి వెళ్లగా, మరో నెలరోజుల్లో అతనికి వివాహం చేసేందుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలోనే ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో తమ కుమారుడు వీరమరణం పొందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. మరోవైపు జస్వంత్ రెడ్డి మృతదేహం శుక్రవారం రాత్రికి బాపట్లకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఉగ్రవాదులపై పోరులో వీరమరణం పొందిన జస్వంత్ రెడ్డి త్యాగం మరువలేనిది అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. దేశ రక్షణలో భాగంగా జమ్మూకాశ్మీర్ లో ప్రాణాలు పణంగాపెట్టి పోరాటం చేసిన జశ్వంత్ రెడ్డి చిరస్మరణీయుడని అన్నారు. జశ్వంత్రెడ్డి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుందని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ