తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవికి ఎల్.రమణ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు రమణ పంపించారు. “తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ప్రజలకు మరింత చేరువగా, రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కావాలనే భావనతో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాను. తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నాను” అని లేఖలో ఎల్.రమణ పేర్కొన్నారు. అలాగే గత 30 సంవత్సరాలుగా తన ఎదుగుదలకు తోడ్పాటునందించిన చంద్రబాబుకు రమణ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
మరోవైపు గురువారం సాయంత్రం ప్రగతి భవన్ లో రాష్ట్ర పంచాయత్ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో కలిసి ఎల్.రమణ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో సమావేశమయ్యారు. ఈ భేటీ సందర్భంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై వారు చర్చించినట్టు తెలుస్తుంది. అనంతరం ఎల్.రమణ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న వివిధ అంశాలపై దాదాపు గంటన్నర పాటుగా మాట్లాడుకున్నాం. వివిధ అంశాలు చర్చకు వచ్చాయి. ఈ సందర్భంగా టీఆర్ఎస్ లోకి రావాలని సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. మా మిత్రులు, అనుచరులతో మాట్లాడి తక్కువరోజుల లోపట్లోనే నిర్ణయానికి వస్తానని, నిర్ణయం సానుకూలంగా ఉంటుందని తెలిపారు. పార్టీలోకి ఆహ్వానించినందుకు సీఎం కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, “తెలంగాణ పోరాటంలో నేను, ఎల్.రమణ ప్రముఖంగా ఉన్నాం. చంద్రబాబును ఒప్పించి లెటర్ ఇప్పించాం. ఎల్.రమణ అంటే కేసీఆర్ కు అభిమానం ఉంది. చేనేత కుటుంబం నుంచి వచ్చిన రమణ పార్టీకి అవసరం. రమణను టీఆర్ఎస్ పార్టీ లోకి రావాలని సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. రమణ కూడా సుముఖత వ్యక్తం చేశారు” తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ