2022లో 92% కోవిడ్ మరణాలు టీకాలు వేయని వ్యక్తులలో జరిగాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ తెలిపారు. దీనివలన లక్షల మంది జీవితాలను రక్షించడంలో వ్యాక్సిన్లు ముఖ్యమైన పాత్ర పోషించాయని స్పష్టమవుతోందని ఆయన అన్నారు. అయితే, ప్రస్తుతం భారతదేశంలో కోవిడ్ కేసులు తగ్గుతున్నాయని.. ఇది ఊరట కలిగించే విషయమని ఐసీఎంఆర్ డైరెక్టర్ అన్నారు. భారతదేశంలో కోవిడ్ పరిస్థితిపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ మాట్లాడుతూ.. ప్రపంచ కోవిడ్ -19 కేసులలో భారతదేశంలో 0.7 శాతం మాత్రమే నమోదయ్యాయని చెప్పారు.
దేశంలో కోవిడ్-19 కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని అగర్వాల్ తెలిపారు. భారతదేశంలో వారానికి సగటున 11,000 కోవిడ్ కేసులు నమోదవుతున్నాయని ఆయన చెప్పారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో కోవిడ్-19 కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని అగర్వాల్ చెప్పారు. దేశంలోని యాక్టివ్ కేసుల్లో 50 శాతం కేరళ, మహారాష్ట్ర, మిజోరాంలో ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. ఒక రాష్ట్రంలో మాత్రమే 10,000 కంటే ఎక్కువ యాక్టివ్ కేసులు ఉన్నాయని, రెండు రాష్ట్రాల్లో 5,000 నుండి 10,000 మధ్య యాక్టివ్ కేసులు ఉన్నాయని, మిగిలిన రాష్ట్రాల్లో 5,000 కంటే తక్కువ యాక్టివ్ కేసులు ఉన్నాయని అగర్వాల్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ