భారత్లో ‘మంకీపాక్స్’ వైరస్ కలకలం రేపుతోంది. ఇటీవలే దేశంలో మంకీపాక్స్ తొలికేసు నమోదైన కేరళలోనే తాజాగా రెండవ కేసు కూడా వెలుగుచూసింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ సోమవారం అధికారికంగా వెల్లడించారు. దుబాయ్ నుంచి వచ్చిన కన్నూర్ జిల్లాకు చెందిన 31 సంవత్సరాల వ్యక్తికి మంకీపాక్స్ నిర్ధారణ అయ్యిందని పేర్కొన్నారు. తాజాగా వైరస్ సోకిన వ్యక్తికి పరియారం మెడికల్ కాలేజీలో చికిత్స అందిస్తున్నామని, ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. కాగా అతనితో సన్నిహితంగా ఉన్న వారిపై దృష్టి పెట్టామని, వారిలో అనుమానాస్పదంగా ఉన్న కొందరి నమూనాలను తీసి నిర్ధారణ టెస్ట్లకు వైరల్ ల్యాబ్ కు పంపినట్లు వీణా జార్జ్ వెల్లడించారు.
అయితే దేశంలో మంకీపాక్స్ వెలుగుచూసిన అనంతరం అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం వైరస్ కట్టడికి కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ క్రమంలో అంతర్జాతీయ ప్రయాణికులకు కూడా పలు సూచనలు చేసింది. కాగా జంతువుల నుంచి వ్యాప్తి చెందే ఈ వ్యాధి ఇప్పటి వరకు భారత్ సహా 50 దేశాలకు విస్తరించింది. మరోవైపు రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి చెందకుండా కేరళ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మంకీపాక్స్ సోకిన వ్యక్తి ప్రయాణించిన విమానంలో ఎక్కువ మంది ప్రయాణికులు ఐదు జిల్లాలకు చెందినవారుగా గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ అయిదు జిల్లాలకు.. కొల్లాం, కొట్టాయం, అలప్పుజా, పథనంతిట్టా మరియు తిరువనంతపురం లకు ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది. ఆ ఇమానంలో ప్రయాణించిన వారందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ