సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్ గా ఐపీఎస్ అధికారి సుబోధ్ కుమార్ జైస్వాల్ నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్ గా విధులు నిర్వహిస్తున్నారు. సీబీఐ డైరెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి జైస్వాల్ రెండేళ్ల పాటుగా ఆ పదవిలో కొనసాగనున్నారు. ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, లోక్సభలో ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌధరి కూడిన ఉన్నత స్థాయి ప్యానెల్ సోమవారం సమావేశమై సీబీఐ డైరెక్టర్ నియామకంపై చర్చించారు. ఈ ప్యానెల్ ముగ్గురి పేర్లను ఎంపిక చేయగా, సీనియర్ అయిన జైస్వాల్ను సీబీఐ డైరెక్టరుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
గత సీబీఐ డైరెక్టర్ రిషి కుమార్ శుక్లా పదవీకాలం ఫిబ్రవరి మొదటి వారంలోనే ముగియగా, అప్పటినుంచే సీబీఐ డైరెక్టర్ పదవి ఖాళీగా ఉంది. అప్పటి నుండి అడిషనల్ డైరెక్టర్ ప్రవీణ్ సిన్హా తాత్కాలిక సీబీఐ చీఫ్ గా వ్యవరిస్తున్నారు. ఇక 1985 బ్యాచ్ మహారాష్ట్ర కేడర్ కు చెందిన ఐపీఎస్ అధికారి జైస్వాల్ అనేక కీలక బాధ్యలు నిర్వహించారు. మహారాష్ట్ర డీజీపీగా, ముంబయి టెర్రరిజం యాంటీ స్క్వాడ్, రాష్ట్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్, మహారాష్ట్ర పోలీసు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) లో పనిచేశారు. అలాగే ప్రధానికి భద్రత కల్పించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పిజి), దేశ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ (ఆర్అండ్డబ్ల్యూ) లో కూడా సుబోధ్ కుమార్ జైస్వాల్ బాధ్యతలు నిర్వర్తించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ