జమ్మూ-కశ్మీర్లో కాంగ్రెస్కు మరో షాక్ తగిలింది. ఇటీవలే పార్టీకి గుడ్ బై చెప్పిన కేంద్ర మాజీ మంత్రి, జమ్మూ-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత గులాం నబీ ఆజాద్కు మద్దతుగా 64 మంది సీనియర్ నేతలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. వీరిలో జమ్మూ-కశ్మీర్ మాజీ ఉప ముఖ్యమంత్రి తారా చంద్ కూడా ఉండటం విశేషం. ఈ మేరకు మంగళవారం ఈ 64 మంది కలిసికట్టుగా ఒకే రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సమర్పించారు. కాగా తారా చంద్తో పాటు మాజీ మంత్రులు అబ్దుల్ మజీద్ వని, మనోహర్ లాల్ శర్మ, ఘరు రామ్, మాజీ ఎమ్మెల్యే బల్వాన్ సింగ్ వంటి కీలక నేతలు రాజీనామా సమర్పించిన వారిలో ఉన్నారు. ఈ క్రమంలో పంచాయతీ రాజ్ సంస్థ సభ్యులు, మున్సిపల్ కార్పొరేటర్లు, జిల్లా స్థాయి నేతలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారు.
ఈ సందర్భంగా శ్రీనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. మా నేత గులాం నబీ ఆజాద్కు మద్దతుగా నిలవాలని తామంతా నిర్ణయించుకున్నామని ప్రకటించారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశామని, మా అందరి ఉమ్మడి రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సమర్పించామని వెల్లడించారు. కాగా అధిష్టానంపై అసంతృప్తితో కాంగ్రెస్ పార్టీతో తనకు గల 5 దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకుని గులాం నబీ ఆజాద్ గత శుక్రవారం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. సీనియర్ల సలహాలను, సూచనలను ఏఐసీసీ పరిగణించదని.. రాహుల్ గాంధీకి రాజకీయ పరిపక్వత లేదని తీవ్ర విమర్శలు చేసిన సంగతి విదితమే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ