దేశంలో త్వరలో మరో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. అమెరికాకు చెందిన ప్రముఖ ఔషధ తయారీ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ యొక్క సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్ భారతదేశంలో అత్యవసర వినియోగానికి అనుమతులు పొందింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా ట్విట్టర్ వేదికగా ప్రకటన చేశారు. “దేశంలో కరోనా వ్యాక్సిన్స్ అందుబాటు మరింత పెరుగుతుంది. జాన్సన్ అండ్ జాన్సన్ యొక్క సింగిల్-డోస్ కరోనా వ్యాక్సిన్ భారతదేశంలో అత్యవసర వినియోగం కోసం ఆమోదించబడింది. ఇప్పుడు దేశంలో అత్యవసర వినియోగం కోసం ఆమోదించబడిన వ్యాక్సిన్స్ 5 ఉన్నాయి. ఇది కరోనా వ్యతిరేకంగా దేశం చేస్తున్న పోరాటానికి మరింతగా తోడ్పాటు ఇవ్వనుంది” అని మన్సుఖ్ మాండవీయా పేర్కొన్నారు.
ముందుగా సింగిల్ డోసు వ్యాక్సిన్ అత్యవసర వినియోగ అనుమతులు పొందేందుకు ఆగస్టు 5న జాన్సన్ అండ్ జాన్సన్ కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిఎస్ సిఓ) నిపుణుల కమిటీ పరిశీలన, ఆమోదానికి సిఫార్సుల అనంతరం తాజాగా జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ కు అనుమతులు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఇక దేశంలోని ప్రముఖ వ్యాక్సిన్ తయారీదారు కంపెనీ అయిన బయోలాజికల్ ఇ లిమిటెడ్ తో సరఫరా ఒప్పందం ద్వారా జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ వ్యాక్సిన్ దేశంలో అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు కోవిషీల్డ్, కొవాక్జిన్, స్పుత్నిక్-వీ, మోడర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ వ్యాక్సిన్ తో కలిపి మొత్తం 5 వ్యాక్సిన్లకు దేశంలో అనుమతులు జారీ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ