సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డే నియమించబడ్డారు. జస్టిస్ బాబ్డే నియామకానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అక్టోబర్ 29, మంగళవారం నాడు ఆమోదముద్ర వేశారు. ప్రస్తుతం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న రంజన్ గొగోయ్ పదవీకాలం నవంబర్ 17, 2019 తో ముగియనున్న సంగతి తెలిసిందే. రంజన్ గొగోయ్ పదవీ విరమణ తరువాతి రోజైన నవంబరు 18న జస్టిస్ బాబ్డే సుప్రీం కోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయన 2021 ఏప్రిల్ 23 వరకు చీఫ్ జస్టిస్ గా కొనసాగనున్నారు.
జస్టిస్ రంజన్ గొగోయ్ ఇటీవలే తన తరువాత అనుభవజ్ఞుడు, సీనియర్ అయిన జస్టిస్ బాబ్డేను పేరును తదుపరి చీఫ్ జస్టిస్ గా ప్రతిపాదిస్తూ కేంద్రానికి లేఖ రాసారు. ప్రతిపాదనను పరిశీలించిన న్యాయశాఖ కార్యాలయం, నివేదికను ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అందించారు. ప్రధాని కార్యాలయం నుంచి రాష్ట్రపతికి చేరగా ఆయన ఆమోదించడంతో చీఫ్ జస్టిస్ గా జస్టిస్ బాబ్డేను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
[subscribe]