తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన నీరా పాలసీ మార్గదర్శకాలను రాష్ట్ర మంత్రులు కె.టి.రామారావు, టి.హరీష్ రావు, వి.శ్రీనివాస్ గౌడ్ అక్టోబర్ 28 సోమవారం నాడు విడుదల చేసారు. నీరా పాలసీ జీవో ను విడుదల చేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని మంత్రులు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, త్వరలో ప్రభుత్వం తరుపున నీరా స్టాల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. దాదాపు 70 సంవత్సరాల నుండి గీత కార్మికులకు ఆంక్షలు పెట్టడమే కానీ వారి వృత్తికి సంబంధించి ఏ ప్రభుత్వం సాయం చెయ్యలేదు, వారికి కనీసం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. గత ప్రభుత్వాలు నీరా కోసం ఇతర దేశాల్లో తిరిగారు కానీ అమలు చెయ్యలేదు. సీఎం కేసీఆర్ గౌడ వృత్తిని కాపాడుకోవటం కోసం తాటి చెట్లను తెలంగాణ హరితహారం కార్యక్రమంలో భాగంగా పెట్టడం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నీరా అమ్మకాలను హైదరాబాద్ లో మొదలుపెట్టి, ప్రభుత్వం తరుపున స్టాల్స్ పెట్టి నీరాను అందిస్తామన్నారు.
నీరా లైసెన్స్ గౌడ కులానికి మాత్రమే ఇస్తామని మంత్రి స్పష్టం చేసారు. నీరాను గీయడం ,అమ్మడం గౌడలు మాత్రమే చెయ్యాలని సీఎం కేసీఆర్ చెప్పారన్నారు. వారి ఆదేశాల మేరకు ప్రభుత్వం తరపున స్టాల్స్ ను ఏర్పాటు చేసి తెలంగాణ వంటకాలను పెట్టాలని చూస్తున్నామన్నారు. ట్యాంక్ బాండ్ పరిసర ప్రాంతాల్లో మొదటి స్టాల్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మొదటి సారి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటివరకు కేరళ, మహారాష్ట్రలలో మాత్రమే ఇలా చేసారని చెప్పారు. దశల వారిగా అన్ని జిల్లాలలో నీరాను ఉత్పత్తి, సరఫరా చేస్తామన్నారు. నీరాలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని, అందులో మంచి మెడిసిన్ లక్షణాలు ఉన్నాయి సీఎం కేసీఆర్ చెప్పారన్నారు. దీని వలన షుగర్, మధుమేహ వ్యాధి కూడా తగ్గుతాయని పలు పరిశోదనలో వెల్లడైందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమములో శాసన మండలి సభ్యులు గంగాధర్ గౌడ్, శాసన సభ్యులు కె.పి.వివేకనంద గౌడ్, మహిపాల్ రెడ్డి, రాష్ట్ర ఫైనాన్స్ కమీషన్ చైర్మన్ రాజేషం గౌడ్, విద్యా శాఖ మౌళిక వసతుల కల్పనల చైర్మెన్ నాగేందర్ గౌడ్, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి, స్పెషల్ సిఎస్ సోమేష్ కుమార్, తదితరులు పాల్గోన్నారు.
[subscribe]