కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కలబురిగి జిల్లాలో ఈరోజు ఉదయం ఓ ప్రయివేటు బస్సు, మినీ లారీ ఢీ కొన్న ఘటనలో 8 మంది మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో 8 మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. అయితే మృతులందరూ తెలంగాణ వాసులు, అందునా హైదరాబాదీలు కావడం విషాదం. అయితే ప్రమాద సమయంలో దగ్గరలో ఉన్న కొందరు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇంకా ఈ ఘటనలో 27 మంది తీవ్రంగా గాయపడగా, చికిత్స నిమిత్తం కలబురిగిలోని 3 ఆస్పత్రులకు తరలించారు. కాగా చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు.
అయితే ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 35 మంది ప్రయాణిస్తున్నారని, ఇది ఆరెంజ్ ట్రావెల్స్కు చెందిన బస్సుగా గుర్తించినట్లు కలబురిగి ఎస్పీ ఇషా పంత్ వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కలబురిగి జిల్లా కమలాపురలో గోవా నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఒక ప్రైవేటు బస్సు అటుగా వెళ్తున్న ఓ ట్రక్కుని ఢీకొట్టింది. ఆ తర్వాత బస్సు ఎదురుగా ఉన్న ఒక బ్రిడ్జిని ఢీకొట్టడంతో పాటు ప్రమాద తాకిడికి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆయిల్ ట్యాంక్ పేలి బస్సులో మంటలు చెలరేగాయి. తక్కువ సమయంలోనే మంటలు బస్సు మొత్తం వ్యాపించడంతో నలుగురు అక్కడిక్కడే సజీవ దహనమయ్యారు. ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మరో నలుగురు మృతి చెందారు.
కాగా ఈ బస్సు గోవా నుంచి హైదరాబాద్కు వెళ్తున్న సమయంలో ఉదయం 6:30 గంటల ప్రాంతంలో బీదర్ – శ్రీరంగపట్నం హైవేపై కమలాపుర సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బర్త్ డే పార్టీ వేడుకల కోసం హైదరాబాద్కు చెందిన రెండు కుటుంబాలు మే 29న గోవా వెళ్లినట్లు, వారిలో ఒక కుటుంబంలో 11 మంది, మరో కుటుంబంలో 21 మంది వెళ్లారని తెలుస్తోంది. కాగా మృతులను.. అర్జున్ (37), సరళ (32), బి.అర్జున్ (5), శివకుమార్ (35), రవళి (30), దీక్షిత (9), అనిత (40) గా పోలీసులు గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉండగా, ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF