తెలంగాణలో యాసంగి ధాన్యం సేకరణ మరో పది రోజుల్లో పూర్తి చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన గురువారం ధాన్యం కొనుగోళ్లపై శ్వేత పత్రం విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేకున్నా, వెనకడుగు వేయకుండా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లను చేపట్టినట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ధాన్యం సేకరణ కోసం భారీగా 13.69 కోట్ల గన్నీబ్యాగులు సేకరించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 6,579 కొనుగోలు కేంద్రాల ద్వారా 7.7 లక్షల మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశామని మంత్రి తెలిపారు.
ప్రస్తుతం సేకరించిన ధాన్యం 41.33 లక్షల మెట్రిక్ టన్నులని, ఈ మొత్తం విలువ రూ. 8 వేల కోట్లని, మంత్రి గంగుల వెల్లడించారు. దీనిలో ఇటీవలి అకాల వర్షాలకు తడిసిన 15 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా ఉందని తెలియజేశారు. ప్రస్తుతం అన్ని కేంద్రాల్లో 7.11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉండగా, మరో 4.32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పొలాల నుంచి రావాల్సి ఉందని అన్నారు. పది రోజుల్లో మిగిలిన ధాన్యం అంతటినీ కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఎక్కడా గోడౌన్లు, ట్రాన్స్పోర్టు వంటి ఇబ్బందులు లేకుండా జిల్లాల యంత్రాంగంతో నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF