కోవిడ్-19 వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ పైన ముద్రిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫొటోను తొలగించాలనే పిటిషన్ను కేరళ హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ల కోసం ప్రజలు డబ్బులు చెలిస్తున్నారని.. అలాంటప్పుడు జారీ చేసే సర్టిఫికెట్పై ప్రధాని మోదీ బొమ్మ ఉండడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అని, సమాచార హక్కు (ఆర్టీఐ) కార్యకర్త పీటర్ మైలిపరంపిల్ కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వ్యక్తిగతమైన సర్టిఫికేట్లో ప్రధాని ఫొటో ఉండడం సరికాదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించాడు. అందుకు కోర్టు స్పందిస్తూ.. ప్రభుత్వ విధానాలపై, ప్రధాన మంత్రి రాజకీయ వైఖరిపై విభేదించవచ్చు. ప్రధానమంత్రిని కాంగ్రెస్ ప్రధాని అని గానీ, బీజేపీ ప్రధాని అని గానీ, ఏ రాజకీయ పార్టీకి ప్రధాని అని గానీ ఎవరూ చెప్పలేరని కోర్టు వ్యాఖ్యానించింది. కానీ, దేశ పౌరులు ఎవరూ ప్రధానమంత్రి ఫోటోతో టీకా ధృవీకరణ పత్రాన్ని తీసుకెళ్లడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు, అని న్యాయమూర్తి జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ పేర్కొన్నారు.
ఈ పిటిషన్ వెనుక రాజకీయ ఉద్దేశం దాగి ఉందని కోర్టు అభిప్రాయపడింది. పిటిషన్ వెనుక అసలు ఉద్దేశం ప్రజా ప్రయోజనాలు కాదని, ప్రచారం కోసమేనని కోర్టు పేర్కొంది. కోర్టులో తీవ్రమైన కేసులు నమోదవుతున్నప్పుడు ఇలాంటి అనవసరమైన పిటిషన్లను ప్రోత్సహించలేమని చెప్పింది. ప్రధానమంత్రి ప్రజలు ఎన్నుకోవడం వల్ల అధికారంలోకి వచ్చాడు. భిన్నమైన రాజకీయ అభిప్రాయాలు ఉండవచ్చు, కానీ ఇప్పటికీ ఆయన్ దేశ ప్రధాని అని కోర్టు పేర్కొన్నట్లు తెలసింది.
కాగా, ఇలాంటి పిటిషన్ వేసి కోర్టు సమయాన్ని వృధాచేసినందుకు గాను పిటిషనర్కు లక్ష రూపాయల ఫైన్ విధించింది హైకోర్టు. పిటిషనర్ రూ. 1 లక్ష జరిమానాను ఆరు వారాల్లోగా కేరళ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి డిపాజిట్ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అతను జరిమానాను సకాలంలో జమ చేయడంలో విఫలమైతే అతని ఆస్తులను విక్రయించడం ద్వారా మొత్తాన్ని రికవరీ చేయాలని కూడా కోర్టు పేర్కొంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ