భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి తీవత్ర రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. గత పదిరోజులుగా పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. మే 27, బుధవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1,51,767 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య ఇప్పటికే 4337 కి చేరింది. మరోవైపు కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్డౌన్ 4.0 మే 31 వ తేదీతో ముగియనుండటంతో భవిష్యత్ కార్యాచరణ, లాక్డౌన్ పొడిగింపు అంశాలపై కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది.
ఈ నేపథ్యంలో రెండు, మూడు రోజుల్లో లాక్డౌన్ 5.0 పై ప్రధాని నరేంద్రమోదీ ప్రకటన చేసే అవకాశమున్నట్టు సమాచారం. దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కరోనా వైరస్ ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల్లో 70 శాతంపైగా కేసులు నమోదవుతున్న 11 నగరాలపైనే లాక్డౌన్ 5.0 లో దృష్టిపెట్టి, కట్టుదిట్టమైన చర్యలు తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ముంబయి, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, కోల్కతా, పుణే, థానే, ఇండోర్, జైపూర్, సూరత్ నగరాల్లో కరోనా నియంత్రణపై ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. లాక్డౌన్ 5.0లో దేవాలయాలు, మసీదులు, చర్చిలు తెరిచేందుకు అనుమతి ఇచ్చే అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. అయితే విద్యాసంస్థలు, షాపింగ్ మాల్స్, థియేటర్స్, బహిరంగ సభలపై పూర్తిస్థాయిలో నిషేధం కొనసాగించే అవకాశం ఉంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu