దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 27 మంది దుర్మరణం చెందారు. పశ్చిమ ఢిల్లీలోని ముండ్కా ప్రాంతంలో గల మెట్రో స్టేషన్ సమీపంలోని ఒక మూడు అంతస్థుల భవనంలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 27 మంది అసువులు బాయగా, 40 మందికి పైగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్లో దాదాపు 60 నుంచి 70 మందిని రక్షించామని, వారిలో పలువురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నందున, ఈ విషాదంలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఘటన గురించి తెలియగానే 24 మంది అగ్నిమాపక సిబ్బందిని పంపామని ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు.
ఈ దుర్ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. “ఢిల్లీలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం కారణంగా ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. నా ఆలోచనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అని ట్విట్టర్లో తెలిపారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి ₹ 2 లక్షల ఎక్స్గ్రేషియాను కూడా ప్రధాని మోదీ ప్రకటించారు. దీనితో పాటు, అగ్నిప్రమాదంలో గాయపడిన వారికి ₹ 50,000 ఇవ్వనున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) తెలిపింది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో పలువురు మృతి చెందిన ఘటనపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తదితరులు తమ సంతాపం వ్యక్తం చేశారు.
ప్రాథమిక విచారణ ప్రకారం, CCTV కెమెరాలు మరియు Wi-Fi రూటర్లను తయారు చేసే సంస్థ కార్యాలయం ఉన్న భవనంలోని మొదటి అంతస్తులో మంటలు చెలరేగి, అనంతరం భవనమంతా పాకాయని డీసీపీ శర్మ చెప్పారు. ఈ అగ్ని ప్రమాద ఘటనలో సంస్థ యజమానులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు స్పష్టం చేశారు. కంపెనీ యజమానులైన వరుణ్ గోయల్, సతీష్ గోయల్ లను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసి వారిపై కేసు నమోదు చేశారు. కాగా ఈ భవనానికి అగ్నిమాపకశాఖ ఎన్ఓసీ లేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే భవనం పై అంతస్తులో ఉంటున్న యజమాని మనీష్ లక్రా పరారీలో ఉన్నాడని, త్వరలోనే అతడిని పట్టుకుంటామని పోలీసు అధికారులు ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ