దేశంలో కోవిడ్ మహమ్మారిపై నిఘా, నియంత్రణ మరియు జాగ్రత్త కోసం సెప్టెంబర్ 28, 2021 నుంచి అమల్లో ఉన్న ఆంక్షలు/నిబంధనలను నవంబర్ 30, 2021 వరకు పొడిగిస్తునట్టు కేంద్ర హోమ్ శాఖ వెల్లడించింది. సెప్టెంబర్ 28న జారీ చేసిన నిబంధనలు అక్టోబర్ 31తో ముగియనుండటంతో వాటిని మరోసారి పొడిగిస్తూ కేంద్ర హోమ్ శాఖ ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు గురువారం కేంద్ర హోం కార్యదర్శి అజయ్ భల్లా అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. దేశంలో ఇంకా కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ ప్రభావం కొనసాగుతుండడం, పండుగల సీజన్ నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకే కోవిడ్ నియంత్రణ చర్యలను కేంద్రం పొడిగించినట్టు తెలుస్తుంది.
రాబోయే పండుగ సీజన్ దృష్ట్యా అన్ని రద్దీ ప్రదేశాలలో కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కోవిడ్ -19 యొక్క సమర్థవంతమైన నిర్వహణ కోసం టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీట్మెంట్, వ్యాక్సినేషన్, కోవిడ్ నిబంధనలు పాటించే వ్యూహంపై నిరంతరం దృష్టి పెట్టాలని సూచించారు. కోవిడ్-19 నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా మరియు సంబంధిత స్థానిక అధికారులందరికీ కఠినమైన ఆదేశాలు జారీ చేయాలని, కోవిడ్ నిబంధనలు అమలు చేయడంలో ఏవైనా అలసత్వం వహిస్తే సంబంధిత అధికారులు వ్యక్తిగతంగా బాధ్యత వహించాలని చెప్పారు. అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రభుత్వాలు కోవిడ్ నియంత్రణ చర్యలు కఠినంగా అమలు చేయాలని, ప్రతిఒక్కరూ నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చూడాలని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ