ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీలో పర్యటిస్తున్నారు. గురువారం రాత్రి న్యూఢిల్లీ నుంచి బయలుదేరిన ప్రధాని మోదీ శుక్రవారం ఉదయం రోమ్ చేరుకున్నారు. 16వ జీ-20 సమ్మిట్ మరియు కాప్-26 ప్రపంచ నాయకుల సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ అక్టోబర్ 29, 2021 నుండి నవంబర్ 2, 2021 వరకు వరుసగా రోమ్, ఇటలీ, గ్లాస్గో, యునైటెడ్ కింగ్డమ్ లలో పర్యటించనున్నారు. ముందుగా ఇటలీ ప్రధాన మంత్రి మారియో డ్రాగి ఆహ్వానం మేరకు అక్టోబర్ 30-31 మధ్య రోమ్లో జరిగే 16వ G-20 సమ్మిట్ లో ప్రధాని పాల్గొంటారు. ఈ సమ్మిట్ కు జి-20 సభ్య దేశాలు, యూరోపియన్ యూనియన్ మరియు ఇతర ఆహ్వానించబడిన దేశాలు మరియు అంతర్జాతీయ సంస్థల అధినేతలు/ప్రభుత్వాలు కూడా హాజరవుతారు. ఇది ప్రధానమంత్రి హాజరయ్యే 8వ జీ-20 సమ్మిట్ అవుతుంది. అంతర్జాతీయ ఆర్థిక సహకారానికి జీ-20 ప్రధాన ప్రపంచ వేదికగా అవతరించింది. ఇక భారత్ తొలిసారిగా 2023లో జీ-20 సమ్మిట్ కు ఆతిథ్యం ఇవ్వనుంది. మరోవైపు ఇటలీ ప్రధానమంత్రి మారియో డ్రాగితో సహా పలు ద్వైపాక్షిక సమావేశాలను కూడా ప్రధాని నిర్వహించనున్నారు.
అనంతరం యూకే ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ఆహ్వానం మేరకు వాతావరణ మార్పుపై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ కి సంబంధించిన 26వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (కాప్-26) యొక్క వరల్డ్ లీడర్స్ సమ్మిట్లో పాల్గొనడానికి ప్రధాని మోదీ గ్లాస్గోకు వెళ్లనున్నారు. కాప్-26 ఇటలీతో భాగస్వామ్యంతో యూకే ప్రెసిడెన్సీలో అక్టోబర్ 31 నుండి నవంబర్ 12 వరకు నిర్వహించబడుతోంది. అయితే కాప్-26 యొక్క ఉన్నత-స్థాయి విభాగం వరల్డ్ లీడర్స్ సమ్మిట్ పేరుతో నవంబర్ 1-2 న నిర్వహించబడుతుంది. ఈ సమ్మిట్కు 120 కంటే ఎక్కువ దేశాల అధినేతలు/ప్రభుత్వాలు హాజరవుకానున్నారు. ప్రధాని మోదీ చివరిసారిగా 2015లో పారిస్లో జరిగిన కాప్-21కి హాజరయ్యారు. మరోవైపు కాప్-26 సందర్భంగా ప్రధాని మోదీ యూకే ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ తో సహా అనేక ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ