మధ్యప్రదేశ్ లోని జబల్పూర్లో ఘోరం చోటుచేసుకుంది. పట్టణంలోని ‘న్యూ లైఫ్’ అనే ఒక ప్రైవేటు ఆసుపత్రిలో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, మరికొందరికి కాలిన గాయాలయ్యాయి. ఇక ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆస్పత్రిలో ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడటంతో భయాందోళనలకు లోనైన పలువురు భయంతో పరుగులు తీశారు. ఇక ఈ ప్రమాదంలో తొలుత 8మంది మృతి చెందగా, ఆ తర్వాత మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
అయితే ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, క్షతగాత్రులను వేరే ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. న్యూ లైఫ్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపిన ఎస్పీ సిద్ధార్థ్ బహుగుణా మిగిలిన వార్డుల్లోని రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ప్రకటించారు. ఇక ప్రమాదానికి కారణం ఆస్పత్రిలో విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ కారణం అయి ఉండొచ్చని అనుమానిస్తున్నామని, మంటలు అదుపులోకి వచ్చాక పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తామని ఆయన వెల్లడించారు. మరోవైపు ఆస్పత్రిలో అగ్నిప్రమాదంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY