ఫోర్బ్స్ విడుదల చేసిన ‘ద రియల్టైమ్ బిలియనీర్స్’ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ టాప్-10లో చోటు దక్కించుకున్నారు. ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన తొమ్మిదో స్థానంలో నిలిచారు. ముందుగా 2019 సంవత్సరానికి గానూ ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచ అత్యధిక ధనవంతుల జాబితాలో ముకేశ్ అంబానీ 13వ స్థానం సంపాదించారు. అయితే నవంబర్ 28, గురువారం నాటి ట్రేడింగ్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10 లక్షల కోట్ల మార్కును అధిగమించి, ఆ ఘనత సాధించిన మొదటి భారతీయ కంపెనీగా అవతరించింది. ఇక భారత మార్కెట్లో టిసిఎస్ రెండవ అత్యంత విలువైన సంస్థకాగా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హిందుస్తాన్ యూనిలివర్, హెచ్డిఎఫ్సి బ్యాంకు తరువాతి స్థానాల్లో ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే గురువారం ట్రేడింగ్ అనంతరం లెక్కల ప్రకారం 60.8 బిలియన్ డాలర్ల సంపదతో ముకేశ్ అంబానీ తొమ్మిదో స్థానంలో నిలిచినట్టు ఫోర్బ్స్ ప్రకటించింది. ఈ జాబితాలో అమెజాన్ వ్యవస్థాపకుడు, సీఈవో జెఫ్ బెజోస్ 113 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. 107.4 బిలియన్ డాలర్ల సంపదతో బిల్గేట్స్ రెండో స్థానంలో, 107.2 బిలియన్ డాలర్లతో బెర్నార్డ్ ఆర్నాల్ట్ మూడో స్థానంలో నిలిచారు. వారెన్ బఫెట్ నాలుగో స్థానంలో, ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకన్ బర్గ్ ఐదో స్థానంలో ఉన్నారు.