తెలంగాణ రాష్టంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై నవంబర్ 29, శుక్రవారం నాడు హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మున్సిపల్ ఎన్నికల యొక్క ముందస్తు ప్రక్రియను మళ్లీ నిర్వహించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వార్డుల విభజన, ఓటర్ల జాబితా సవరణలపై జులైలో ఇచ్చిన ప్రభుత్వ నోటిఫికేషన్ను ఈ సందర్భంగా హైకోర్టు రద్దు చేసింది. ఈ అంశాలపై నిబంధనలకనుగుణంగా మార్పులు చేసి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ముందస్తు పక్రియను 14 రోజుల్లోగా ముగించాలని కోర్టు సూచించింది. అలాగే రాష్ట్రంలోని 73 మున్సిపాలిటీలపై విధించిన స్టేను కూడా హైకోర్టు ఎత్తివేసింది.
హైకోర్టు తీర్పుతో తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ లభించినట్టయింది. రాష్ట్రంలో మొత్తం 13 కార్పోరేషన్స్, 128 మున్సిపాలిటీలు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ కార్పోరేషన్ల పదవికాలం పూర్తికాకపోవడంతో మిగిలిన 10 కార్పోరేషన్స్ లలో మాత్రమే ఎన్నికలు జరగబోతున్నాయి. అదే విధంగా కొన్ని కారణాల వలన 5 మున్సిపాలిటీలలో, పదవీకాలం పూర్తి కానందువలన సిద్దిపేట, అచ్చంపేటలలో ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించరు. ఇక మిగిలిన 121 మున్సిపాలిటీలలో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. కొన్ని నెలలుగా మున్సిపల్ ఎన్నికల అంశం కోర్టు పరిధిలో ఉంది, ఇప్పుడు తీర్పు వెలువడిన నేపథ్యంలో ప్రధాన పార్టీలైన టిఆర్ఎస్, కాంగ్రెస్ ఎన్నికలపై కసరత్తు మొదలుపెట్టనున్నాయి.
[subscribe]