ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఇప్పటికే కొత్తరకం కరోనా వైరస్ వేరియంట్స్ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ లో కూడా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్థాపించిన ఇన్సాకోగ్ ల్యాబ్లలో జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా కొత్తరకం కరోనా వైరస్ లను నిర్ధారణ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు పంపించిన మొత్తం 10787 పాజిటివ్ శాంపిల్స్ లో 771 మందిలో కొత్త కరోనా వేరియంట్స్ కనుగొన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అందులో 736 మందిలో యూకే (బి.1.1.7) కరోనా రకం, 34 మందిలో దక్షిణాఫ్రికా (బి.1.351) కరోనా రకం, ఒకరిలో బ్రెజిలియన్ (పి.1) కరోనా రకం నిర్ధారణ అయినట్టు తెలిపారు. ఈ కొత్త రకం కరోనా వేరియంట్స్ దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో వెలుగుచూసినట్లు పేర్కొన్నారు.
అయితే ఈ కొత్త రకం కరోనా వేరియంట్స్ పాటుగా భారత్ లో డబుల్ మ్యూటెంట్ వేరియంట్ కూడా కనుగొనబడిందని చెప్పారు. కాగా ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో కరోనా కేసుల పెరుగుదలకు కొత్తరకం కరోనా వేరియంట్స్ కారణం లేదా ప్రత్యక్ష సంబంధం ఉందనడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని మరింతగా విశ్లేషించడానికి జెనోమిక్ సీక్వెన్సింగ్ మరియు ఎపిడెమియోలాజికల్ అధ్యయనాలు కొనసాగుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు ఇప్పటికి ఏపీలో 17 శాంపిల్స్ లో యూకే కరోనా వేరియంట్, 3 శాంపిల్స్ లో దక్షిణాఫ్రికా వేరియంట్ను గుర్తించినట్లు తెలిపారు. ఇక తెలంగాణలో 87 శాంపిల్స్ లో యూకే కరోనా వేరియంట్, 17 శాంపిల్స్ లో దక్షిణాఫ్రికా కరోనా వేరియంట్ నిర్ధారణ అయినట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ