ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యునైటెడ్ కింగ్ డమ్ (బ్రిటన్) లో కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ వ్యాప్తి మొదలయింది. యూకే హెల్త్ సెక్రటరీ మాట్ హాంకాక్ మాట్లాడుతూ, కరోనావైరస్ యొక్క కొత్త స్ట్రెయిన్ నియంత్రణలో లేదని పేర్కొన్నారు. వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమయ్యే వరకు ఇంగ్లాండ్లోని కొన్ని ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు అమల్లో ఉంటాయని అన్నారు. అలాగే యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ, లండన్ సహా దక్షిణ మరియు తూర్పు ఇంగ్లాండ్ యొక్క ప్రాంతాల్లో మళ్ళీ లాక్డౌన్ విధిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇంతకు ముందు కరోనా వ్యాప్తితో పోల్చుకుంటే కొత్తరకం కరోనా వైరస్ (వీయూఐ-202012/01) 70 శాతం ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతోందన్నారు. దేశంలో కొత్తగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో 60 శాతం కంటే ఎక్కువ కేసులు కొత్తరకం వైరస్ ద్వారానే సంక్రమించినట్టు గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఇటలీలో కూడా కొత్తరకం కరోనా వైరస్ ను గుర్తించినట్టు తెలుస్తుంది.
యూకేలో కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ వ్యాప్తితో అక్కడి నుంచి వచ్చే విమాన రాకపోకలపై పలు దేశాలు నిషేధం విధించాయి. భారత్, నెదర్లాండ్, బెల్జియం, ఆర్జెంటినా, కొలంబియా, చిలీ, సౌదీ అరేబియా, ఐర్లాండ్, టర్కీ, ఇజ్రాయెల్ దేశాలు నిషేధం విధించాయి. మరికొన్ని దేశాలు యూకే నుంచి వచ్చే ప్రయాణికులకు క్వారంటైన్ నియమాలు అమల్లోకి తెచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ