2012లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులకు మార్చి 3, 2020వ తేదీ ఉదయం 6 గంటలకు ఉరిశిక్ష అమలు చేయాలని ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు ఫిబ్రవరి 17న కొత్త డెత్ వారెంట్ జారీ చేసింది. ఇప్పటికే ఉరిశిక్షను అడ్డుకునేందుకు దోషులు వివిధ రకాల ప్రయత్నాలు చేయడంతో ఉరిశిక్ష అమలు రెండు సార్లు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఈసారైనా ఉరిశిక్ష అమలు అవుతుందా, దోషులు క్షమాభిక్ష పిటిషన్లతో మరోసారి అడ్డుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది.
ఉరి శిక్ష అమలు ఆలస్యం కావడంతో నలుగురు దోషులను వేర్వేరుగా ఉరితీయాలంటూ ముందుగా కేంద్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. నలుగురు దోషులను వేర్వేరుగా ఉరితీయడం కుదరదని కోర్టు తేల్చి చెప్పింది. హైకోర్టు తీర్పుపై ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. సుప్రీం కోర్టు విచారణ చేపట్టిన అనంతరం పిటిషన్లు పెండింగ్లో ఉన్నప్పటికీ విచారణ న్యాయస్థానం ఉరిశిక్ష అమలుకు కొత్త తేదీని నిర్ణయించవచ్చని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పాటియాలా కోర్టు నలుగురు దోషులను మార్చి 3న ఉరితీయాలంటూ కొత్త డెత్వారెంట్ జారీ చేసింది.
[subscribe]