పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో 140కి పైగా పిటిషన్లపై దాఖలైన సంగతి తెలిసిందే. జనవరి 22, బుధవారం నాడు ఈ పిటిషన్లపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సీఏఏ పై స్టే విధించేందుకు సర్వోన్నత న్యాయస్ధానం నిరాకరించింది. అలాగే సీఏఏకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై నాలుగు వారాల్లోగా స్పందించాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అప్పటివరకు సీఏఏ అంశంపై రాష్ట్రాలలోని హైకోర్టులు ఎలాంటి విచారణలు చేపట్ట వద్దని, ఉత్తర్వులు కూడా ఇవ్వొద్దని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీచేసింది.
సీఏఏ అమలును సవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లపై విచారణ జరిపేందుకు ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని కోర్టు తెలిపింది. ఐదువారాల తర్వాత ఈ పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే విచారణను ఈ రాజ్యాంగ ధర్మాసనం చేపడుతుందని చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే పేర్కొన్నారు. ముందుగా విచారణలో భాగంగా పిటిషనర్ల తరఫునుంచి, ప్రభుత్వం నుంచి ధర్మాసనం వాదనలు వినింది. కేంద్ర ప్రభుత్వం స్పందన తెలుసుకోకుండా సీఏఏపై ఎలాంటి స్టే విధించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు నిర్ణయంతో సీఏఏ అమలుపై కేంద్ర ప్రభుత్వానికి ఊరట లభించినట్టయింది.
[subscribe]