జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జనవరి 22, బుధవారం నాడు ఢిల్లీకి వెళ్లారు. జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో కలిసి పవన్ కల్యాణ్ ఢిల్లీ చేరుకున్నారు. జనవరి 23, గురువారం మధ్యాహ్నం వరకు పవన్ కల్యాణ్ ఢిల్లీలోనే ఉండే అవకాశమునట్టు తెలుస్తుంది. ఈ పర్యటనలో భాగంగా పలువురు బీజేపీ నాయకులను పవన్ కల్యాణ్ కలవనున్నారు. ముందుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా ఎన్నికైన జేపీ నడ్డాతో సమావేశమయ్యే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు ఇతర బీజేపీ పెద్దలను కూడా ఆయన కలవనున్నారు.
మరోవైపు ఈ పర్యటన ముగిసేలోగా ప్రధాని నరేంద్రమోదీని పవన్ కళ్యాణ్ కలుసుకుని ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై చర్చించబోతున్నట్టు సమాచారం. రాష్ట్రంలో ఇకపై జనసేన, బీజేపీ పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరిగే సమన్వయ కమిటీ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కలిసి పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లును ఆమోదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఎలా ముందుకెళ్లాలి, రాష్ట్రంలో ఇతర సమస్యలపై స్పందించే విధానాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు.
[subscribe]