పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ప్రారంభం అయ్యాయి. కాగా ప్రతి సంవత్సరం బడ్జెట్ సమావేశాల మొదటి రోజు పార్లమెంటు సెంట్రల్ హాల్లో రాష్ట్రపతి ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగించడం ఆనవాయితీగా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లోక్సభ మరియు రాజ్యసభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇక పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు హాజరయ్యారు. కాగా రాష్ట్రపతి ప్రసంగం తర్వాత దేశ ఆర్థిక పరిస్థితిని వివరించే ఆర్థిక సర్వేను రెండు సభల్లో ప్రవేశ పెట్టనున్నారు. ఈ సర్వే ప్రకారం.. రేపటి బడ్జెట్ ఎలా ఉండనుంది అనే దానిపై సభ్యులు ఒక అంచనాకు వస్తారు. ఈ సందర్భంగా నేడు, రేపు జీరో అవర్, క్వశ్చన్ అవర్ నిర్వహించబడదు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు. ప్రసంగంలోని కొన్ని ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే.. భారతదేశం నిరుపమానమైన ఆర్ధిక వ్యవస్థగా ఎదిగింది. జీ-20 గ్రూప్ దేశాలకు నాయకత్వం వహించే అవకాశంతో మన బాధ్యత మరింత పెరిగింది. ప్రపంచ వేదికలపై భారతదేశం యొక్క గొప్పతనాన్ని ఇతర దేశాలు కీర్తిస్తున్నాయి. అన్ని రంగాలలో భారత్ దూసుకుపోతోంది. దేశ ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి. దేశంలోకి భారీ పెట్టుబడులు ప్రవహిస్తున్నాయి. అలాగే ఎంతోమంది ఎంటర్ ప్రెన్యూర్స్ ను కేంద్రం ప్రోత్సహిస్తోంది. విమానయానం మరియు రైల్వేలతో సహా దేశంలోని ప్రతి రంగంలో మౌలిక సదుపాయాల పురోగతి కనిపిస్తోంది. దేశంలోని రైల్వే మ్యాప్లో అనేక నూతన ప్రాంతాలు కలుపబడుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ రైల్వే నెట్వర్క్గా భారతీయ రైల్వే వేగంగా దూసుకుపోతోంది. 2014 నుండి తమ ప్రభుత్వం సౌరశక్తి సామర్థ్యాన్ని దాదాపు 20 రెట్లు పెంచింది. నేడు భారతదేశం పునరుత్పాదక ఇంధన సామర్థ్యం పరంగా ప్రపంచంలో నాల్గవ స్థానంలో ఉంది. తొమ్మిదేళ్ల క్రితమే శిలాజాయేతర ఇంధనాల నుంచి దేశ విద్యుత్లో 40% సామర్థ్యాన్ని ఉత్పత్తి చేయాలనే లక్ష్యాన్ని దేశం ఇప్పటికే సాధించింది’ అని పేర్కొన్నారు.
ఇక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 లోక్సభ ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ ప్రభుత్వం యొక్క చివరి, పూర్తి స్థాయి 2023-2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి 1న సమర్పించనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు నిర్మలా సీతారామన్ తొలుత లోక్సభలో ఆ తర్వాత రాజ్యసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో గురువారం ఉభయ సభలూ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చను ప్రారంభిస్తాయి. ఈ చర్చకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు సభల్లోనూ సమాధానాలు ఇవ్వనున్నారు. కాగా ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను రెండు విడతలుగా నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా మొదటి విడుత సమావేశాలు ఫిబ్రవరి 10 వరకు జరగనుండగా.. మలివిడత సమావేశాలు మార్చి 12 నుంచి ఏప్రిల్ 6 వరకు కొనసాగనున్నాయి. ఇదిలా ఉండగా మరోవైపు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు నిరసనగా బీఆర్ఎస్, ఆప్ పార్టీలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE