దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి మళ్ళీ పెరుగుతుంది. గత కొన్ని రోజులుగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తితో పాటుగా భారీసంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. జనవరి 12, బుధవారం నాటికీ దేశంలో కరోనా కేసుల సంఖ్య 3,60,70,510 కు చేరుకుంది. 3,46,30,536 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 9,55,319 మంది చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులుతో రేపు (జనవరి 13, గురువారం) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఆయా రాష్ట్రాల్లో కరోనా పరిస్థితి, కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, అమలు చేస్తున్న ఆంక్షలు, బాధితులకు వైద్యం అందుతున్న తీరు, కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం, తదితర అంశాలపై కీలకంగా చర్చించనున్నారు.
2020లో దేశంలో కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చినప్పటి నుంచి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ అనేకసార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా మూడో వేవ్ దిశగా విజృంభణ కొనసాగుతుండంతో మరోసారి సీఎంలతో సమావేశం అవ్వాలని ప్రధాని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. దేశంలో కేసులు ఎక్కువుగా నమోదవుతున్న ప్రాంతాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే పలు ఆంక్షలు సహా, నైట్ కర్ఫ్యూ విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంక్షల ప్రభావం, లాక్డౌన్ అంశం సహా సంబంధిత విషయాలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ