ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 26, శుక్రవారం ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా “ఆత్మ నిర్భర్ ఉత్తర ప్రదేశ్ రోజ్ గార్ అభియాన్” అనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్నిప్రారంభించనున్నారు. కోవిడ్-19 మహమ్మారి శ్రామికులపై ముఖ్యంగా వలస కార్మికులపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ సమయంలో ఉత్తరప్రదేశ్ లోని 31 జిల్లాల్లోకి 25 వేల మందికి పైగా వలస కార్మికులు తిరిగి వచ్చారు. దీంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం “ఆత్మ నిర్భర్ ఉత్తర ప్రదేశ్ రోజ్ గార్ అభియాన్” అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఉపాధి కల్పించడం, స్థానిక వ్యవస్థాపకతను ప్రోత్సహించడంతో పాటు పారిశ్రామిక సంఘాలు, ఇతర సంస్థలతో భాగస్వామ్యాన్ని సృష్టించడంపై ఈ అభియాన్ దృష్టి సారిస్తుంది.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించే ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉత్తర ప్రదేశ్ కు చెందిన సంబంధిత మంత్రిత్వ శాఖల మంత్రులు కూడా పాల్గొంటారు. ఉత్తరప్రదేశ్లోని ఆరు జిల్లాలకు చెందిన గ్రామస్తులతో కూడా పీఎం మోదీ ఈ సందర్భంగా సంభాషించనున్నారు. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో సామాజిక దూరం నిబంధనలను పాటిస్తూ, కామన్ సర్వీస్ సెంటర్లు మరియు కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా ఉత్తర ప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లోని గ్రామాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
లాక్ డౌన్ సమయంలో పెద్ద సంఖ్యలో వలస కార్మికులు అనేక రాష్ట్రాలకు తిరిగి వచ్చారు. కోవిడ్ -19 ని కట్టడి చేయడంతో పాటుగా, వలసదారులకు మరియు గ్రామీణ కార్మికులకు జీవనోపాధిని అందించాల్సిన ఉండడంతో రాష్ట్రాలపై భారం పడుతుంది. ఈ క్రమంలో వివిధ రంగాలను ఉత్తేజపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీని ప్రకటించింది. అలాగే దేశంలోని వెనుకబడిన ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పన దిశగా ఉపాధి కల్పించడానికి గరిబ్ కల్యాణ్ రోజ్ గార్ యోజనను జూన్ 20 వ తేదీన పీఎం మోదీ ప్రారంభించారు. ఈ తరహా కార్యక్రమాన్నే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రారంభించనున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu