బీహార్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 125 సీట్లతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎన్డీఏ కూటమిలో 74 సీట్లతో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. బీహార్ లో ఎన్డీఏ విజయం నేపథ్యంలో ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. బీహార్ తో పాటుగా దేశంలో పలు రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీకి ఘనవిజయం అందించిన ప్రజలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలియజేశారు. కరోనా పరిస్థితుల మధ్య ఎన్నికలు నిర్వహించడం సులభం కాదని, ఈ పరిస్థితుల్లో కూడా ప్రజలు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచ్చి ఎన్డీఏ/బీజేపీ అభ్యర్థులకు పట్టం కట్టారన్నారు. బీహార్ లో ఎలాంటి హింస చోటుచేసుకోకుండా ఎన్నికలు జరిగాయన్నారు.
దేశ అభివృద్ధికి గొప్పగా పనిచేసే వారికే దేశానికి సేవ చేసే అవకాశం కల్పిస్తామని భారత ప్రజలు పదేపదే స్పష్టం చేస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. ముఖ్యంగా సైలెంట్ ఓటర్ల గురించి మనం తరచుగా వింటున్నామని, అయితే దేశవ్యాప్తంగా మహిళా ఓటర్లే బీజేపీకి సైలెంట్ ఓటర్లుగా మారారని ప్రధాని మోదీ చెప్పారు. దేశంలో మహిళల జీవన ప్రమాణాలు మెరుగు పడేందుకు బీజేపీ కృషి చేసిందన్నారు. ఇక వంశపరంపర రాజకీయాలు ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ముప్పు అని దేశ యువత తెలుసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే బీజేపీ పాత్ర మరింతగా పెరుగుతుందని అన్నారు. ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వస్’ సిద్దాంతంతోనే బీహార్లో అభివృద్ధి పనుల చేపట్టి బీహార్ ఎన్నికల్లో విజయం సాధించామని తెలిపారు. జనతా కర్ఫ్యూ సమయం నుండి నేటి వరకు కేంద్ర ప్రభుత్వం కరోనా మహమ్మారిపై పోరాడిన విధానం కూడా ఈ ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ