భారతదేశ 15వ రాష్ట్రపతిగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. తన ప్రత్యర్థి, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా పై ఆమె ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఫలితాలు వెలువడ్డ వెంటనే ద్రౌపది ముర్ము నివాసానికి చేరుకుని శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేశారు. ప్రధాని మోదీ వెంట బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఉన్నారు.
మరోవైపు ద్రౌపది ముర్ము దేశ నూతన రాష్ట్రపతిగా ఎన్నికవడంపై ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ, “భారతదేశం చరిత్ర లిఖించింది. 1.3 బిలియన్ల మంది భారతీయులు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ను జరుపుకుంటున్న సమయంలో, తూర్పు భారతదేశంలోని మారుమూల ప్రాంతంలో జన్మించిన గిరిజన సమాజానికి చెందిన భారతదేశపు కుమార్తె మన రాష్ట్రపతిగా ఎన్నికైంది. ఈ ఘనత సాధించిన శ్రీమతి ద్రౌపది ముర్ము జీకి అభినందనలు. ద్రౌపది ముర్ము జీ జీవితం, ఆమె ప్రారంభ పోరాటాలు, ఆమె గొప్ప సేవ మరియు ఆమె ఆదర్శప్రాయమైన విజయం ప్రతి భారతీయుడిని ప్రేరేపిస్తాయి. ఆమె మన పౌరులకు, ముఖ్యంగా పేదలకు, అట్టడుగున ఉన్నవారికి మరియు అణగారిన వారికి ఆశా కిరణంగా ఉద్భవించింది” అని అన్నారు.
“ద్రౌపది ముర్ము జీ అత్యుత్తమ ఎమ్మెల్యే మరియు మంత్రి. ఆమె జార్ఖండ్ గవర్నర్గా అద్భుతమైన పదవీకాలం గడిపారు. భారతదేశం యొక్క అభివృద్ధి ప్రయాణానికి ముందు నుండి నాయకత్వం వహించే మరియు బలోపేతం చేసే అత్యుత్తమ రాష్ట్రపతిగా ఆమె ఉంటుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. పార్టీలకతీతంగా ద్రౌపది ముర్ము జీ అభ్యర్థిత్వానికి మద్దతిచ్చిన ఎంపీలు మరియు ఎమ్మెల్యేలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆమె రికార్డు విజయం మన ప్రజాస్వామ్యానికి శుభసూచకం” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY