ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం మూడు దేశాల పర్యటనకు బయలుదేరారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన జపాన్, పపువా న్యూ గినియా మరియు ఆస్ట్రేలియాల దేశాలను సందర్శించనున్నారు. ఈ క్రమంలో ముందుగా G7 గ్రూపింగ్ మరియు క్వాడ్ సహా మూడు కీలక బహుపాక్షిక శిఖరాగ్ర సమావేశాలలో పాల్గొననున్నారు. జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిడ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఈ సదస్సులో పాల్గొంటారని కేంద్ర ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది. ఈ సదస్సు జపాన్ అధ్యక్షతన జరుగనుందని, ఈ సందర్భంగా ఇరుదేశాల ప్రధానులు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని పేర్కొంది. కాగా జపాన్ ప్రధాని కిషిడ ఈ ఏడాది మార్చిలో ఇండియాలో పర్యటించిన విషయం తెలిసిందే.
ఇక జపాన్ పర్యటన అనంతరం ప్రధాని మోదీ పపువా న్యూగినియా వెళ్లనున్నారు. పోర్ట్ మోర్స్బైలో ఇండియా-పసిఫిక్ దీవుల సహకార వేదిక మూడో సదస్సుకు పపువా న్యూగినియా ప్రధాన మంత్రి జేమ్స్ మరపేతో కలిసి ఆయన సహ ఆతిథ్యం ఇస్తారు. కాగా భారత దేశ ప్రధాన మంత్రి పపువా న్యూగినియాలో పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక ఆ తర్వాత ప్రధాని మోదీ పపువా న్యూ గినియా నుంచి ఆస్ట్రేలియా వెళ్తారు. ఇరుదేశాల మధ్య కీలక అంశాలపై చర్చించేందుకు ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ మోదీని ఆహ్వానించారు. కాగా ఇంతకుముందు భారత్-ఆస్ట్రేలియా వార్షిక సమావేశం న్యూఢిల్లీలో మార్చిలో జరిగింది.
ఇక జపాన్ పర్యటనకు బయలుదేరేముందు ప్రధాని మోదీ ఒక ప్రకటనలో.. జీ20 సదస్సుకు ఈ సంవత్సరం మన దేశం అధ్యక్షత వహిస్తోందని, అందువల్ల జీ7 సదస్సులో తాను పాల్గొనడం చాలా ముఖ్యమైనదని చెప్పారు. జీ7 దేశాల అధినేతలతోనూ, ఈ సదస్సులో పాల్గొనే ఇతర దేశాల అధినేతలతోనూ తాను తన అభిప్రాయాలను పంచుకుంటానని తెలిపారు. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటిని పరిష్కరించడానికి సమష్టిగా కృషి చేయవలసిన అవసరం గురించి తన అభిప్రాయాలను వారికి తెలియజేస్తానన్నారు. G7 అధునాతన ఆర్థిక వ్యవస్థల వార్షిక శిఖరాగ్ర సదస్సులో భాగంగా ఆహారంతో సహా ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లపై మాట్లాడనున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు.
ఇక న్యూ గినియా పర్యటనపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. పసిఫిక్ దీవుల దేశాలు 14 ఉన్నాయని, ఈ అన్ని దేశాలు ఈ ముఖ్యమైన సదస్సుకు హాజరయ్యేందుకు అంగీకరించడం సంతోషమని మోదీ తెలిపారు. 2014లో ఫిజీలో తాను పర్యటించినపుడు ఎఫ్ఐపీఐసీని ప్రారంభించినట్లు తెలిపారు. మనల్ని కలిపే అంశాలపై ఈ దేశాల నేతలతో మాట్లాడటానికి తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. వాతావరణ మార్పులు, సుస్థిర అభివృద్ధి, సామర్థ్య నిర్మాణం, శిక్షణ, ఆరోగ్యం, సంక్షేమం, మౌలిక సదుపాయాలు, ఆర్థికాభివృద్ధి వంటి అంశాలపై చర్చించేందుకు ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE