దేశంలో కోవిడ్-19 బారినపడి మరణించిన వారి కుటుంబాలకు రూ.50 వేల చొప్పున ఎక్స్గ్రేషియా అందించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఈ మేరకు జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ సిఫార్సు చేసినట్లు పేర్కొంది. కోవిడ్ మృతులకు సహాయం అందించడంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కోవిడ్ తో మరణించిన వారి కుటుంబాలకు రూ.50 వేల ఎక్స్గ్రేషియా అందించడంపై జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ గైడ్లైన్స్ జారీ చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం జారీచేయబడిన కోవిడ్-19 మరణ ధృవీకరణ పత్రం ఆధారంగా ఎక్స్గ్రేషియా అందించబడుతుందని తెలిపారు. అయితే ఈ ఎక్స్గ్రేషియా మొత్తాన్ని స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (రాష్ట్ర విపత్తు సహాయ నిధి) నుంచి చెల్లించాలని గైడ్లైన్స్లో పేర్కొన్నారు.
కోవిడ్ తో మరణించిన వారితో పాటుగా, కోవిడ్ బాధితులకు సేవలు అందిస్తూ, సంబంధిత సంసిద్ధత కార్యకలాపాల్లో పాల్గొని వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కూడా ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే ఇప్పటి వరకు మరణించిన వారితోపాటు భవిష్యత్తులో కోవిడ్-19 మహమ్మారి దశల వలన సంభవించే మరణాలకు కూడా ఈ ఎక్స్గ్రేషియా వర్తిస్తుందని చెప్పారు. జిల్లా విపత్తుల నిర్వహణ అథారిటీ/ జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో ఈ ఎక్స్గ్రేషియా చెల్లింపులు జరగనున్నాయి. మరోవైపు దేశంలో ఇప్పటికే కోవిడ్-19 మరణాల సంఖ్య 4,46,050 కు చేరుకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ