ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం నేపాల్ దేశంలో పర్యటిస్తున్నారు. నేపాల్ ప్రధానమంత్రి షేర్ బహదూర్ దేవుబా ఆహ్వానం మేరకు బుద్ధ పూర్ణిమ సందర్భంగా నేడు నేపాల్ లోని లుంబినీలో ప్రధాని మోదీ ఒకరోజు అధికారిక పర్యటన చేపడుతున్నారు. 2014 నుంచి ప్రధాని మోదీ నేపాల్లో పర్యటించడం ఇది ఐదవసారి. నేపాల్ లోని లుంబినీకి చేరుకున్న ప్రధాని మోదీకి నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా మరియు పలువురు నేపాల్ మంత్రులు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా ప్రధాని మోదీ లుంబినీలోని పవిత్ర మాయాదేవి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని మార్కర్ స్టోన్ వద్ద నివాళులర్పించారు. అలాగే ఆలయానికి ఆనుకుని ఉన్న అశోక స్తంభం దగ్గర దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వెంట నేపాల్ ప్రధాని, ఆయన సతీమణి డాక్టర్ అర్జురానా దేవుబా ఉన్నారు.
అనంతరం లుంబినీ మోనాస్టిక్ జోన్ లో ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ బుద్ధిస్ట్ కల్చర్ అండ్ హెరిటేజ్ నిర్మాణానికి శిలాన్యాస్/శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని మోదీ, నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా పాల్గొన్నారు. ఐబీసీకి లుంబినీ డెవలప్మెంట్ ట్రస్ట్ కేటాయించిన ప్లాట్లో ఇంటర్నేషనల్ బౌద్ధ సమాఖ్య (ఐబీసీ), న్యూఢిల్లీ ద్వారా ఈ కేంద్రం నిర్మించబడుతుంది. శిలాన్యాస్ వేడుక తర్వాత ఇద్దరు ప్రధానులు ఈ కేంద్రం యొక్క నమూనాను కూడా ఆవిష్కరించారు. అలాగే నేపాల్ ప్రభుత్వ ఆధ్వర్యంలో లుంబినీ డెవలప్మెంట్ ట్రస్ట్ నిర్వహించే బుద్ధ జయంతి కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. ఇక ఇరువురు ప్రధానమంత్రులు మధ్య ఒక ద్వైపాక్షిక సమావేశం జరగగా, జలవిద్యుత్, అభివృద్ధి మరియు కనెక్టివిటీతో సహా బహుళ రంగాలలో సహకారాన్ని విస్తరించడానికి వీరి మధ్య చర్చలు జరిగినట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF