ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి కాంగ్రెస్ వైఖరిపై మండిపడ్డారు. నిన్న లోక్సభలో ఆ పార్టీ తీరును ఎండగట్టిన ప్రధాని మోదీ.. ఈరోజు రాజ్యసభలో మరోసారి కాంగ్రెస్ విధానాలను ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ ను హడావిడిగా విభజించి.. ఆ రాష్ట్రానికి చాలా అన్యాయం చేసిందని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. మంగళవారం రాజ్యసభలో ప్రసంగించిన ప్రధాని కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఆనాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న లోపభూయిష్ట విధానాలతో రెండు తెలుగు రాష్ట్రాలు ఇప్పటికీ కష్టాల్లోనే ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
ప్రధాని మోదీ ఇంకా ఇలా అన్నారు.. పార్లమెంటులో విభజన చట్టంపై ఎలాంటి చర్చలు జరగలేదని చెప్పారు. కాంగ్రెస్ సభ్యులు పెప్పర్ స్ప్రే వాడారని, పార్లమెంటులో తలుపులు వేసి, మైక్లు కట్ చేసి, బిల్లును ఆమోదించారన్నారు. ఇంత గందరగోళ పరిస్థితులు నెలకొనడానికి కాంగ్రెస్ పార్టీ అహంకారం, అధికార కాంక్షే కారణమని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము తెలంగాణాకు వ్యతిరేకం కాదని ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్పష్టం చేశారు. విభజన జరిగిన తీరును మాత్రమే తాము తప్పుబడుతున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. బీజేపీ అగ్ర నేత అటల్ బిహారీ వాజ్పాయి ప్రధాన మంత్రిగా ఉన్న కాలంలో ఎటువంటి వివాదాలకు తావు లేని రీతిలో, శాంతియుతంగా మూడు రాష్ట్రాలను ఇచ్చామని చెప్పారు. విభజన సరిగా జరిపివుంటే ఈనాడు రెండు రాష్ట్రాలమధ్య సమస్యలు వచ్చేవే కావు అని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ