తెలంగాణలో కరోనా థర్డ్ వేవ్ ముగిసినట్లే అని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్) డా. శ్రీనివాస రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రస్తుత కరోనా పరిస్థితులపై డా. శ్రీనివాస రావు మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస రావు మాట్లాడుతూ.. తెలంగాణాలో జనవరి నెలతో కోవిడ్ ఉధృతి ముగిసిందని తెలిపారు. కరోనా మూడు వేవ్ల రూపంలో ప్రపంచంపై దాడి చేసిందన్నారు. ప్రస్తుతం తెలంగాణలో కరోనా పాజిటివీటి రేటు రెండు శాతం మాత్రమే ఉందని డీహెచ్ శ్రీనివాస రావు తెలిపారు. ఫస్ట్ వేవ్ 10 నెలలు, సెకండ్ వేవ్ 6 నెలలు, థర్డ్ వేవ్ మూడు నెలలు మాత్రమే ఉందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎలాంటి కోవిడ్ ఆంక్షలు లేవని ఈ సందర్భంగా తెలియజేసారు. అలాగే, ఇకముందు కూడా ఎలాంటి ఆంక్షలు అక్కర్లేదని ఆయన చెప్పారు. కేంద్రం కూడా ఆంక్షలు ఎత్తివేసిందని డా. శ్రీనివాస రావు వెల్లడించారు. కరోనా వలన గత రెండేండ్లుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని డీహెచ్ శ్రీనివాస రావు తెలిపారు.
ఇకపై తెలంగాణ లో వర్క్ ఫ్రంహోం విధానం అక్కర్లేదన్నారు. ఐటీ సంస్థలు వర్క్ ఫ్రం హోం విరమించుకోవచ్చు అని సూచించారు. అన్ని సంస్థలు వంద శాతం పని చేయవచ్చు అని చెప్పారు. ఉద్యోగులు పూర్తి సంఖ్యలో కార్యాలయాలకు వెళ్లొచ్చు. విద్యాసంస్థలను పూర్తిగా ప్రారంభించామని తెలిపారు. కేసులు తగ్గినా మాస్కులు ధరించాలని సూచించారు. ఇప్పట్లో కొత్త వేరియంట్లు వచ్చే అవకాశం లేదని.. ఎన్ని వేరియంట్లు వచ్చినా ఎదుర్కోగలమని ధీమా వ్యక్తం చేశారు. వ్యాక్సిన్తోనే కరోనాను సమర్థంగా ఎదుర్కొన్నామని తెలిపారు. అయితే, కేసులు తగ్గినా రాష్ట్రంలో ఫీవర్ సర్వేను కొనసాగిస్తామని శ్రీనివాస రావు తెలిపారు. ఫీవర్ సర్వే ద్వారా ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కోవిడ్ కిట్లు అందజేశారని చెప్పారు. భవిష్యత్తులో.. కరోనాను సీజనల్ ఫ్లూగా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని డీహెచ్ శ్రీనివాస్ వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ