భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు (పీవీ సింధు) ఖాతాలో మరో టైటిల్ చేరింది. ఆదివారం జరిగిన స్విస్ ఓపెన్ ఫైనల్లో విజేతగా నిలిచిన పీవీ సింధు, ఈ ఏడాదిలో రెండో టైటిల్ను కైవసం చేసుకుంది. బాసెల్లో జరిగిన స్విస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్లో థాయ్లాండ్ క్రీడాకారిణి, నాలుగో సీడ్ బుసానన్ పై 21-16, 21-8 తేడాతో అద్భుత విజయం సాధించింది. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పీవీ సింధు మ్యాచ్ ఆసాంతం ఆధిపత్యం చూపిస్తూ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ ఏడాది జనవరిలో పీవీ సింధు సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ గెలుచుకోగా, తాజాగా స్విస్ ఓపెన్ విజయంతో ఆమె ఈ ఏడాది రెండో సూపర్ 300 టైటిల్ను కూడా గెలుచుకుంది. మరోవైపు స్విస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో భారత ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ రన్నరప్గా నిలిచాడు. ఇండోనేషియాకు చెందిన నాలుగో సీడ్ జొనాథన్ చేతిలో 12-21, 18-21తో ప్రణయ్ ఓడిపోయాడు. కాగా 2016 లో ప్రణయ్ స్విస్ ఓపెన్ ఛాంపియన్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
స్విస్ ఓపెన్ విజేత పీవీ సింధుకు ప్రధాని మోదీ, సీఎం వైఎస్ జగన్ అభినందనలు:
స్విస్ ఓపెన్ 2022 విజేతగా నిలిచిన భారత షట్లర్ పీవీ సింధుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు వారు ట్వీట్స్ చేశారు. “”స్విస్ ఓపెన్-2022 గెలిచినందుకు పీవీ సింధుకి అభినందనలు. ఆమె సాధించిన విజయాలు భారతదేశ యువతకు స్ఫూర్తినిస్తాయి. ఆమె భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అలాగే సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేస్తూ, “స్విస్ ఓపెన్-2022 మహిళల సింగిల్స్ టైటిల్ను కైవసం చేసుకున్న తెలుగు షట్లర్, దేశానికే గర్వకారణమైన పీవీ సింధుకు అభినందనలు. దేవుని ఆశీస్సులు ఆమెకు ప్రతి ప్రయత్నంలో ఎల్లప్పుడూ ఉండాలి” అని అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ